నారావారి దేవస్థానంగా టిటిడి:బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి;శ్రీవారి దాదా సంచలన వ్యాఖ్యలు
విజయవాడ:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నారావారి దేవస్థానంగా మారిపోయిందని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి, టిటిడి బోర్డ్ మాజీ సభ్యుడు జి. భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన టిడిపి ప్రభుత్వంపై, టిటిడిపై విమర్శల వర్షం కురిపించారు. తిరుమల జేఈఓ కార్యాలయమే అడ్డాగా శ్రీవారి సేవా టికెట్ల పేరుతో లక్షల రూపాయలు ప్రతి రోజూ చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు. కొంతమంది సిబ్బంది ఏకంగా టిటిడినే దళారీ క్షేత్రంగా మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత నెల 27వ తేదీన జేఈఓ టికెట్ల తనిఖీలో జరిగిన విచారణ నివేదికను బయటపెట్టాలని బీజేపీ రాష్ర్ట కార్యదర్శి జి. భాను ప్రకాశ్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎపి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న కొంతమంది సిబ్బందికి సేవా టిక్కెట్ల కుంభకోణంలో ప్రమేయముందని ఆయన ఆరోపించారు. టీటీడీలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని జి. భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
ఇదిలావుంటే సామాన్య భక్తులకు ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పూర్తి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తిరుమల చరమ గ్రంథం పండితుడు శ్రీవారి దాదా విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన బెంగుళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గత పదేళ్ల నుంచి ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేస్తోందన్నారు. శ్రీవారి దర్శనానికి తప్పుడు పద్ధతులు, ఉత్సవాలు, సేవలు చేస్తున్నందువల్ల స్వామిని దర్శించుకునే భక్తులకు మంచి జరగకపోగా, చెడు జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారని, వీఐపీలు, రాజకీయ నేతలు మినహా సామాన్య భక్తులకు శ్రీవారి సంపూర్ణ దర్శన భాగ్యం కలగడం లేదన్నారు. సమస్యల్ని దేవుడి వద్ద మొరపెట్టుకునేందుకు వచ్చే భక్తులు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్జిత బ్రహ్మోత్సవాలు సరికాదని...నగదు చెల్లించిన భక్తులకు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం తగదని చెప్పారు.
అలాగే తోమాల సేవలో భోగ శ్రీనివాసమూర్తికి వస్త్రాలు లేకుండా అభిషేకం చేయడం, శుక్రవారపు అభిషేకంలో శ్రీదేవి, భూదేవి, శ్రీవారికి వస్త్రాలు ధరించకుండా అభిషేకాలు చేస్తూ సామాన్య భక్తులు తిలకించే అవకాశం కల్పించడం వల్ల చెడు ఫలితాలు వస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ఇకనైనా శ్రీవారి సంపూర్ణ దర్శనాన్ని సామాన్య భక్తులకు కల్పించే విధంగా టిటిడి పాలకమండలి చర్యలు తీసుకోవాలని తిరుమల చరమ గ్రంథం పండితుడు శ్రీవారి దాదా కోరారు.