రూ.30 లక్షలు టిటిడి గుట్టుగా నా ఖాతాలో జమ చేసింది...దీంతో నిధుల తరలింపు తేలిపోయింది:రమణ దీక్షితులు
తిరుపతి:టిటిడి నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా...తాను ఎటువంటి దరఖాస్తు చేయకుండానే నా పేరిట నా అకౌంట్ లో రూ.30 లక్షలు జమచేశారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు.
డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత అవి తన రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులుగా అధికారులు చెబుతున్నారని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, ఆగమ విరుద్ధ పద్దతులను బయటపెట్టినందుకు తనను కక్షపూరితంగా ఆలయంలో అర్చక బాధ్యతల నుంచి తొలగించిన టీటీడీ...ఇప్పుడు మరోసారి ఏకపక్ష నిర్ణయంతో తన బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేసిందని ఆయన ఆరోపించారు.
టిటిడి తన ఖాతాలో డబ్బులు జమచేసిన విషయమై రమణ దీక్షితులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజానికి తన అర్చక నియామకం సర్వీసు రూల్స్ ప్రకారం జరగలేదని, వంశపారంపర్య హక్కుల ప్రకారం తాను అర్చక బాధ్యతల్లో పనిచేశానని రమణదీక్షితులు వివరించారు. ఈ కారణంగానే 20-30 ఏళ్ల పాటు తాను ఆ బాధ్యతల్లో కొనసాగినప్పటికీ, తనకు ఎటువంటి అలవెన్స్లు గాని, సర్వీసు ఉత్తర్వులు గాని లేవన్నారు.
అలాగే పదవీ విరమణ కూడా తన సమ్మతితో జరగలేదని...అలాగే రిటైర్మెంట్ సెటిల్మెంట్ అని టిటిడి చెబుతున్న నగదు గురించి కనీసం తనను సంప్రదించలేదని, తనకు అసలు ఇలా డబ్బు జమ చేస్తున్న విషయం చెప్పలేదని...అలాగే తాను వారిని ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడగలేదని రమణ దీక్షితులు తెలిపారు. తనతో పాటు బలవంతంగా తొలగించిన వారి ఖాతాల్లో కూడా ఇంతే మొత్తంలో డబ్బులు జమచేశారని రమణ దీక్షితులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఎలాంటి వోచర్, రశీదు లేకుండా, ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు శ్రీవారి ఖజానాలోని దాదాపు కోటి రూపాయలను ఇలా మాజీ అర్చకులైన మా ఖాతాల్లో జమ చేసినట్లుగానే...మిగిలిన విషయాల్లో కూడా ఇలా ఇంకెన్ని కోట్లు తరలించారో అని రమణదీక్షితులు అనుమానం వ్యక్తంచేశారు. టీటీడీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఇన్నాళ్లూ తాను చెబుతున్న మాటలు తాజా పరిణామం బట్టి నిజమేనని స్పష్టమైందని రమణదీక్షితులు వివరించారు.
ఏదేమైనా టీటీడీలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐ విచారణ తప్పకుండా జరిపించాలని ప్రజలందరూ కోరాల్సిన పరిస్థితి ఏర్పడిందని రమణ దీక్షితులు తన ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ చట్టవ్యతిరేక నిర్ణయాలను, తన పదవీ విరమణ వ్యవహారాలను తాను కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటానని రమణ దీక్షితులు స్పష్టం చేశారు.