మే 3 తరువాత శ్రీవారి దర్శనంపై టీటీడీ ఈఓ క్లారిటీ: పద్మావతి పరిణయోత్సవాలు సైతం..!
తిరుపతి: ఏటేటా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించే పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా తీవ్రత తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే.. అమ్మవారి పరిణయోత్సవాలను నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
శ్రీవారికి నిర్వహించే రోజువారీ పూజలు, నిత్య కైంకర్యాలతో పోల్చుకుంటే.. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు భిన్నంగా ఉంటాయి. ఈ ఉత్సవాలు సజావుగా కొనసాగించడానికి కనీసం 50 మంది తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. స్వామివారి నిత్య పూజా కైంకర్యాలతో పోల్చుకుంటే..పరిణయోత్సవాల్లో మానవ వనరుల వినియోగం అధికంగా ఉంలుందని, దాన్ని నివారించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సింఘాల్ స్పష్టం చేశారు. స్వామివారి కైంకర్యాలు యథాతథంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
జూన్ 30వ తేదీ వరకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారని, ఈ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్ణయాన్ని తీసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి నిర్ణయమేదీ తాము తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందని, వాటిని నమ్మొద్దని అన్నారు. లాక్డౌన్ ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాము నడుచుకుంటామని చెప్పారు.
Recommended Video
శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించడంపై మే 3వ తేదీన తరువాత నిర్ణయం తీసుకుంటామని సింఘాల్ స్పష్టం చేశారు. మే 3వ తేదీ తరువాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే నిబంధనల మేరకే తమ తదుపరి నిర్ణయం ఉంటుందని అన్నారు. తిరుమలకు భక్తులు ఎలా చేరుకుంటారు? వారికి రవాణా వ్యవస్థ ఎలా ఉంటుంది? చేరుకున్న తరువాత వారికి ఎలాంటి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి రక్షణ చర్యలను తీసుకోవాలి? సోషల్ డిస్టెన్సింగ్ను ఎలా అమలు చేయాలి? అనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరిస్తామని అన్నారు.