రమణదీక్షితులు, విజయసాయిరెడ్డికి టిటిడి నోటీసులు...చర్యలు తీసుకుంటాం!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. టీటీడీపై చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలని దేవస్థానం బోర్డు వారిద్దరినీ కోరింది.
టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ వారిని టీటీడీ తన నోటీసులో వివరణ అడిగింది. దీంతో టిటిడి వివాదం మళ్లీ రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు టిటిడిలో వివిధ విభాగాల అధిపతులతో జెఈవో రివ్యూ నిర్వహించారు.
తిరుమల అన్నమయ్య భవన సమావేశ మందిరంలో దేవస్థానంలోని వివిధ విభాగాధిపతులతో మంగళవారం జేఈవో శ్రీనివాసరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి జారీ చేస్తున్న ఉచిత టోకెన్లను క్రమంగా పెంచనున్నట్లు చెప్పారు. సమయ నిర్దేశిత సర్వదర్శనానికి భక్తుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రణాళిక ప్రకారం శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతోందని జేఈవో వివరించారు.
"యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నిత్యం మంగళవారం నుంచి గురువారం వరకు 17 వేలు, సోమ, శుక్రవారాల్లో 20 వేలు, శని, ఆదివారం 30 వేలు వంతున తిరుమల, తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నాం. టోకెన్లు విధానం ప్రవేశపెట్టని పక్షంలో ధర్మదర్శనం క్యూలైను ఆమాంతం పెరిగిపోయి మాడవీధుల్లోకి చేరే పరిస్థితి ఉండేది...కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత ఏడాది వేసవి సెలవుల కంటే ఎక్కువగా ఈసారి తిరుమలకు భక్తులు వచ్చారు. గత 20 రోజులుగా రద్దీ మరీ ఎక్కువగా ఉంది. అయినా...సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు మూడునాలుగు గంటల్లోనే స్వామివారి దర్శనం చేసుకోగలుగుతున్నారు"...అని జెఈవో వివరించారు. వారాంతంలోనే కాకుండా వారపు రోజుల్లోనూ రద్దీ తగ్గడంలేదని, జులై 5 వరకు కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
శ్రీవారి పాదాల ప్రాంతంలో ఏనుగుల సంచారంపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జేఈవో తెలిపారు. "వారం రోజుల క్రితం ఏనుగులు వచ్చాయి...ఇందుకు ఆధారాలు కూడా లభించాయి. రెండు రోజుల కింద మళ్లీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఎలాంటి ఆధారులు లేవు. భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 4 నుంచి ఉదయం 10 గంటల వరకు తాత్కాలికంగా శ్రీవారి పాదాల మార్గాన్ని మూసివేసి భక్తసంచారం లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏనుగులను భయపెట్టి తరమడానికి టపాకాయలు, డ్రమ్స్ను అందుబాటులో ఉంచాం. అటవీశాఖ డీఎఫ్వో ఫణికుమార్నాయుడు ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది నిఘా పెట్టారు. భక్తులు సంచరించే ప్రాంతాల్లోకి ఏనుగులు రాకుండా కందకాలు తవ్వేందుకు, సౌర కంచె నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం"...అని జెఈవో చెప్పారు.
ఇదిలా వుండగా టిటిడికి సంబంధించిన మరో వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. రమణ దీక్షితులు కంటే ముందే టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. బుధవారం ఆయన సుప్రీం కోర్టులో కెవియెట్ పిటిషన్ను దాఖలు చేశారు. కాగా తనను అక్రమంగా అర్చక పదవి నుంచి తొలగించారని, వచ్చేనెలలో సుప్రీంలో పిటిషన్ వేస్తానని రమణదీక్షితులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలగించిన ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో సహా మిగిలిన వారి స్థానంలో టిటిడి వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు ను నియమించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రమణ దీక్షితుల కన్నా ముందు వేణుగోపాల దీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత చర్చనీయాంశంగా మారింది.