తిరుమల లడ్డూకు లైసెన్స్ కావాలంట ! గోవిందా గోవిందా
తిరుమల/అమరావతి: ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్న శ్రీవారి లడ్డూ నాసిరకంగా ఉందని, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా పోటులో (లడ్డూలు తయారు చేసే కేంద్రం) లడ్డూలు తయారు చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)కు ఫిర్యాదు చేశారు.
బెంగళూరుకు చెందిన ఆర్ టీఐ కార్యకర్త టి. నరసింహమూర్తి ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేసి వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. ప్రసాదం రూపంలో తయారు చేస్తున్న లడ్డూలో నాణ్యత లేదని, అక్కడ లడ్డూలు తయారు చేస్తున్న వారు ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాలను పాటించడం లేదని ఆరోపిస్తూ అతను లేఖ రాశాడు.
అయితే ఈ విషయంపై టీటీడీ ఇచ్చిన వివరణను ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరస్కరించింది. వెంటనే ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమాల ప్రకారం లడ్డూలు తయారు చెయ్యాలని టీటీడీ, ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వాలకు సూచించింది.
నియమాలు ఉల్లంఘించి టీటీడీ శ్రీవారి లడ్డూలు తయారు చేసి విక్రయిస్తున్నారని, ఆ లడ్డూలలో ఇంతకు ముందు అనేక వస్తువులు ఉన్న విషయం బయటకు వచ్చిందని ఆరోపిస్తూ ఆర్ టీఐ కార్యకర్త టి. నరసింహమూర్తి 2016 జూన్ 28వ తేదిన ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాడు.
లడ్డూ తయారు చేస్తున్న పోటు కేంద్రం శుభ్రంగా లేదని, లడ్డూలు తయారు చెయ్యడానికి టీటీడీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, అక్కడ లడ్డూలు తయారు చేస్తున్న సిబ్బంది ఆరోగ్యం పర్యవేక్షించడానికి వైద్యలు లేరని నరసింహ మూర్తి లేఖలో ఆరోపించాడు.
ప్రసాదాలు స్వీకరించే భక్తులకు బిల్లులు ఇవ్వడం లేదని, కేవలం టోకన్లు మాత్రం ఇచ్చి మళ్లీ వాటిని వెనక్కి తీసుకుని లడ్డూలు ఇస్తున్నారని, అందు వలన ఎవ్వరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవకాశం కూడా లేదని నరసింహమూర్తి లేఖలో ఆరోపించాడు.
ఈ విషయంపై తనిఖీలు చెయ్యాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి మనవి చేశాడు. ఈ విషయంలో తినిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహార పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులకు లేఖ రాసింది.
అయితే ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రావడంలేదని ఆరోపిస్తూ నరసింహ మూర్తి ఆగస్టు 23వ తేదిన మళ్లీ ఎఫ్ఎస్ఎస్ఏఐకి లేఖ రాశాడు. టీటీడీ నుంచి తమకు సమాచారం వచ్చిన వెంటనే మీకు చెబుతామని ఎఫ్ఎస్ఎస్ఏఐ అతనికి సమాధానం ఇచ్చింది.
అయితే మేము ఎన్నిసార్లు లేఖ రాసినా టీటీడీ స్పంధించడం లేదని, వారి మీద చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 10వ తేదిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహార పౌర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులకు లేఖ రాసింది.
లడ్డూ సరుకు కాదు, ఆహారం అంతకంటే కాదు, ప్రసాదం: టీటీడీ
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించి స్వీకరించే శ్రీవారి లడ్డూ ఆహారం కాదని, లడ్డూ సరుకు కాదని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూ తయారు చెయ్యడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతి తీసుకోవాలనే నియమాలు ఏమీ లేవని టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబశివరావు ఎఫ్ఎస్ఎస్ఏఐకి సెప్టెంబర్ 17వ తేదిన లేఖ రాశారు.
శ్రీవారి భక్తులకు పవిత్రంగా ప్రసాదం రూపంలో ఇచ్చే లడ్డూ ఆహారం కాదని, అలా పిలవడానికి అవకాశం లేదని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి లడ్డూను ఉచితంగా పంపిణి చేస్తామని, అదే విధంగా రాయితీ ధరతో భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయిస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
ఇలా లడ్డూలు కొనుగోలు చేసే వారిని భక్తులు అంటారని, ఆ భక్తులను కొనుగోలుదారులు అని ఎవ్వరూ పిలవరని టీటీడీ ఎఫ్ఎస్ఎస్ఏఐకి చెప్పింది. అయితే టీటీడీ వివరణను ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిగణలోకి తీసుకోలేదు.
టీటీడీ లడ్డూలు తయారు చెయ్యడానికి కచ్చితంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. అయితే ఆ విషయంపై పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ఆహార పౌర సరఫరాల శాఖ జాయింట్ కమీషనర్, ఇతర సీనియర్ అధికారులు సెప్టెంబర్ 22వ తేదిన తిరుమలకు వెళ్లారని సమాచారం.
ఆ సమయంలో లడ్డూలు తయారు చేసే పోటు కేంద్రంలోకి అధికారులను అనుమతించడానికి టీటీడీ అధికారులు నిరాకరించారని తెలిసింది. లడ్డూలు తయారు చేసే ప్రాంతం చాల పవిత్రమైనదని, ఇక్కడికి ఇతరులను అనుమతించమని టీటీడీ అధికారులు చెప్పారని సమాచారం.