Chittoor dairy: టీటీడీ చేతికి చిత్తూరు డెయిరీ?: శ్రీవారి కైంకర్యాల కోసం సొంతంగా పాల సేకరణ.. !
చిత్తూరు: దేశంలోనే రెండో అతి పెద్ద పాల కర్మాగారంగా పేరున్న చిత్తూరు విజయ డెయిరీని తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకోనుందా? లడ్డూ, ప్రసాదాల తయారీ సహా శ్రీవారి కైంకర్యాల్లో వినియోగించే పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులను ఈ పాల కర్మాగారం నుంచే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి రంగం సిద్ధం చేసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. స్వామివారి సేవల కోసం వినియోగించే పాలను సొంతంగా సేకరించడంలో భాగంగా- టీటీడీ ఈ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం సరిహద్దు గ్రామాల్లో కలకలం: పొలాల్లో దిగిన ఛార్టెడ్ విమానం: ఎమర్జెన్సీ ల్యాండింగ్.. !
రెండుసార్లు మూత పడ్డ కర్మాగారం..
దేశంలోనే రెండో అతి పెద్ద పాల కర్మారాగం చిత్తూరులోని విజయ డెయిరీ. 2001లో ఒకసారి, 2015లో మరోసారి పూర్తిగా మూతపడిన ఈ కర్మాగారాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాలనివ్వట్లేదని తెలుస్తోంది. దీన్ని పునరుద్ధరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం పడుతుందనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమౌతోందని అంటున్నారు. అలాగనీ- అంత భారీ కర్మాగారాన్ని, వందలాది మంది రైతులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించే డెయిరీని ఖాయిలాగా గుర్తించడానికీ ప్రభుత్వం అంగీకరించట్లేదని చెబుతున్నారు.
టీటీడీ చేతుల్లోకి..
ఈ నేపథ్యంలో- ఈ డెయిరీని టీటీడీ చేతుల్లో పెడితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో- చిత్తూరు విజయా డెయిరీని పునరుద్ధరించడం, సొంతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించాలని టీటీడీ పాలక మండలి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని, వచ్చే పాలక మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.
సొంతంగా పాల సేకరణ దిశగా..
తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలు, పెరుగు, నెయ్యి అవసరాలు ఏ స్థాయిలో ఉంటయనేది మనకు తెలియనిది కాదు. స్వామివారి కైంకర్యాలు, లడ్డు, ఇతర ప్రసాదాల తయారీ కోసం రోజూ వేల కొద్దీ లీటర్ల పాలను వినియోగిస్తుంటారు అర్చకులు. సాధారణ రోజుల్లోనే లక్ష లీటర్ల వరకు పాలు, పెరుగును వినియోగిస్తుంటారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే వారాంతపు రోజులు, సెలవు దినాలు, బ్రహ్మోత్సవాలు, పండుగలు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. రోజూ 16 టన్నుల మేర నెయ్యిని ఉపయోగిస్తుంటారు.
గోశాల ఉన్నప్పటికీ..
దీనికోసం టీటీడీ అధికారులు సొంతంగా ఓ గోశాలను నడిపిస్తున్నారు. అక్కడి నుంచి పాలను సేకరిస్తుంటారు. అది పరిమితంగా మాత్రమే. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లోని ప్రభుత్వ పాల సహకార సంస్థల నుంచి పెద్ద మొత్తంలో పాలను కొనుగోలు చేస్తుంటుంది టీటీడీ. ఇదివరకు మహారాష్ట్ర నుంచి నెయ్యిని తెప్పించుకునేది. రోడ్డు మార్గం గుండా వచ్చే సరికి నెయ్యి నాణ్యత తగ్గిపోతోందనే కారణంతో అక్కడి నుంచి సేకరణకు పుల్స్టాప్ పెట్టింది. మన రాష్ట్రం నుంచే నెయ్యిని తెప్పించుకుంటోంది.
కోట్లాది రూపాయలతో పాల కొనుగోలు కంటే..
ఇంత భారీ మొత్తంలో పాలు, పెరుగు, నెయ్యి సహా ఇతర పాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఏటా వందల కోట్ల రూపాయలను వ్యయం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి, పాలను సేకరించడం కంటే సొంతంగా పాల సేకరణ కార్యకలాపాలను ఆరంభించడమే మేలు అనే అభిప్రాయం టీటీడీ అధికారుల్లో వ్యక్తమౌతోంది. దీనికోసం అందుబాటులో ఖాళీగా ఉంటూ వస్తోన్న చిత్తూరు విజయా డెయిరీని స్వాధీనం చేసుకోవాలనే దిశగా యోచిస్తున్నారు అధికారులు.
Recommended Video
సొంతంగా ఫ్యాక్టరీని నడిపించాలనే దిశగా..
చిత్తూరు డెయిరీని స్వాధీనం చేసుకోవడం వల్ల స్వామివారి కైంకర్యాల కోసం నాణ్యమైన పాలను వినియోగించినట్లవుతుందని, నేరుగా పాలను సేకరించడం వల్ల పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసినట్టవుతుందనే అభిప్రాయం టీటీడీ అధికారుల్లో వ్యక్తమౌతోంది. దీనికి గల సాధ్యసాధ్యాలను పరిశీలించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. వచ్చే పాలక మండలి సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వం అంగీకరిస్తే.. చిత్తూరు డెయిరీని స్వాధీనం చేసుకోవడం లాంఛనప్రాయమే అవుతుందని చెబుతున్నారు.