టీటీడీ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం: ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదు!
తిరుమల: తిరుమల తితిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం శ్రీవారి సన్నిధిలోని గరుడ ఆళ్వారు ఎదుట ఘనంగా జరిగింది.
మండలి అధ్యక్షుడిగా పుట్టా సుధాకర్ యాదవ్, సభ్యులుగా బొండా ఉమా మహేశ్వరరావు, పొట్లూరి రమేశ్బాబు, ఎనగాల పెద్దిరెడ్డి, చల్లా రాంచంద్రారెడ్డి, జీఎస్ఎస్ శివాజీ, డొక్కా జగన్నాథం, బీకే.పార్థసారథి, మేడ రామక్రిష్ణారెడ్డి, రుద్రరాజు పద్మరాజు, రాయపాటి సాంబశివరావుతో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎక్స్అఫీషియో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్, టీటీడీ ఈవో సింఘాల్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి సభ్యులు శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి మందిరంలోని రంగనాయకుల మండపానికి చేరుకున్నారు.
ఆ తర్వాత మండలి అధ్యక్ష, సభ్యులను టీటీడీ ఈవో, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు సత్కరించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను వారికి అందజేశారు. అనంతరం అన్నమయ్య భవన్లో మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు.
ఎమ్మెల్యే డుమ్మా
కాగా, టీటీడీ ధర్మకర్తల మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరుకాలేదు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సుగుణమ్మను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది.