కొడుకుకు షాక్: రమణదీక్షితులుకు చెక్ పెట్టే దిశగా టిటిడి అడుగులు?
తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు చెక్ పెట్టే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
తిరుమల: తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుకు చెక్ పెట్టే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
మిరాశి మొదలు మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన వరకు అర్చకుల మధ్య విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే.
సూర్యప్రభ వాహన సేవ నుంచి తప్పించాలని
తాజాగా, సూర్యప్రభ వాహన సేవ నుంచి రమణ దీక్షితులు కుమారుడిని తప్పించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లుగా విధులకు హాజరు కానీ రమణ దీక్షితులు కొడుకుకు ఇప్పుడు వాహన సేవలు కేటాయించడం సరికాదంటున్నారు.
ఈవో ఆదేశాలు
ఈ మేరకు టిటిడి డిప్యూటీ ఈవో కోదండ రామారావు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన వచ్చినా, రాకున్నా సూర్యప్రభ వాహన సేవ విషయం టిటిడికి ఏం సంబంధమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
కొలిక్కిరాని సూర్యప్రభ వాహన కేటాయింపు
సూర్యప్రభ వాహన సేవ కేటాయింపు విధులు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. రమణ దీక్షితులు తనయుడు వెంకట దీక్షితులు రెండేళ్లుగా గైర్హాజరవుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు మరొకరికి అప్పగించాలని డిప్యూటీ ఈవో ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు ముందే విభేదాలు
మూడు రోజుల క్రితం సీఎం చంద్రబాబు ఎదుటే టిటిడిలో విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రికి తలపాగా కట్టేందుకు కంకణదారుడు వేణుగోపాల్ దీక్షితులు వస్త్రాన్ని తీసుకున్నారు. వేణుగోపాల్ స్వామి దగ్గర నుంచి రమణదీక్షితులు తీసుకున్నారు. రమణదీక్షితులు రెండుసార్లు లాక్కోవడంతో వేణుగోపాల్ స్వామి వస్త్రాన్ని వదిలేశారు. చివరకు రమణ దీక్షితులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టారు.