క్యాష్ లెస్ తిరుమల: టీటీడీలో ఆమ్యామ్యాలు చెల్లవిక: టికెట్ల కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు!
తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమలలో లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన కొద్దిరోజుల్లోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు తిరుమల తిరుపతి అధికారులు. నగదు లావాదేవీలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. అవినీతికి, లంచగొడితనానికి అవకాశం ఇస్తోన్న నగదు లావాదేవీలను నిషేధించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుమలలో జారీ చేసే అన్ని రకాల టికెట్లకు ఇక నగదు రహితంగా మార్చబోతున్నారు. శ్రీవారి దర్శనం, లడ్డూ కౌంటర్లు, వసతి గృహాల కేటాయింపు.. ఇలా అన్ని దశల్లోనూ నగర రహిత లావాదేవతలను ప్రవేశ పెట్టడానికి టీటీడీ పాలనా యంత్రాంగం త్వరలోనే ఏర్పాట్లు చేపట్టబోతోంది. దీనికి అవసరమైన స్వైపింగ్ యంత్రాలను కొనుగోలు చేయనుంది.
తిరుమలలో వసతి, దర్శనం టిక్కెట్ల కేటాయించడానికి ఉద్దేశించిన కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, లంచగొండితనాన్ని రూపుమాపడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా.. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నామని అన్నారు. తిరుమలలో ఆంధ్రా బ్యాంకు కౌంటర్ లో శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయానికి సంబంధించినంత వరకు రెండు శాతం వరకు వసూలు చేస్తోన్న స్వైపింగ్ చార్జీలను సైతం రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచే దీన్ని రద్దు చేశామని అన్నారు.
శ్రీవారి దర్శనం, వసతి సముదాయాలు, లడ్డూల టికెట్లను జారీ చేసే కౌంటర్లలో పనిచేసే కొంతమంది సిబ్బంది.. భక్తుల నుంచి అదనంగా డబ్బులను వసూలు చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయని, వాటిని నియంత్రించడానికి స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి అవసరమైన అన్ని ప్రణాళికలను రూపొందించినట్లు అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఈ ప్రణాళికలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఆమోదించాల్సి ఉంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన త్వరలో జరిగే పాలక మండలి సమావేశానికి ఈ ప్రణాళికలను పంపిస్తామని అన్నారు.