శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధం: ఏడుకొండలవాడి తొలి దర్శన భాగ్యం వారికే: త్వరలో ఆన్లైన్
తిరుపతి: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు. జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకకు అనుమతించనుంది.
Recommended Video
దేవాలయాల దర్శనానికి అనుమతి..
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5 అమలులోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. భారీగా సడలింపులనూ ప్రకటించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారా ఇతర ప్రార్థనా మందిరాలను జూన్ 8వ తేదీ నుంచి భక్తుల కోసం తెరచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. ఫలితంగా- అదేరోజున తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు.
లాక్డౌన్లోనే మార్పులు
ఆదివారం నాటితో ముగియబోతోన్న నాలుగో విడత లాక్డౌన్ ముగింపు దశలోనే సందర్భంగా ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని కల్పించడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇదివరకు వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు. వేలాది మంది భక్తులు బారులు తీరి నిల్చునే క్యూలైన్లలో భారీ మార్పులను చేపట్టారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ఈ మార్పులు చేర్పులు చేశారు. క్యూలైన్లోకి అడుగు పెట్టబోయే ప్రతి భక్తుడికీ థర్మల్ స్క్రీనింగ్ను నిర్వహించడాన్ని తప్పనిసరి చేశారు. భక్తులు థర్మల్ స్క్రీనింగ్ తరువాతే క్యూ లైన్లోకి అడుగు పెట్టాలని ఆదేశించనున్నారు.
భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో మార్పులు
భక్తుల భౌతిక దూరాన్ని పాటించడానికి వీలుగా తిరమల క్యూలైన్లలో మార్పులు చేశారు. టేప్లతో మార్కింగ్ చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా మార్కింగ్ లోపలే నిల్చోవాల్సి ఉంటుంది. ఒక్కో మార్కింగ్ మధ్య మూడు అడుగుల మేరం దూరం ఉండేలా జాగ్రత్తలను తీసుకున్నారు అధికారులు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడంలో భాగంగా.. ఈ మార్కింగ్ చేసినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం రావొద్దని హెచ్చరిస్తున్నారు. తిరుమలకు వచ్చిన తరువాత అనారోగ్యానికి గురైతే.. వారికి వైద్య సహాయాన్ని అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
కంపార్ట్మెంట్లకు తాళాలు..
సోషల్ డిస్టెన్సింగ్ను పాటించని భక్తులను వెనక్కి పంపించేస్తామని అన్నారు. దీనికోసం క్యూలైన్ల వద్ద భక్తులను పర్యవేక్షించడానికి ప్రత్యేక చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. అలాగే- వసతి సముదాయాల గదుల్లోనూ ఇద్దరికి మించి అనుమతి ఇవ్వకపోవచ్చు. స్వామివారి దర్శనానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉండే విధానానికి పుల్స్టాప్ పెట్టబోతున్నారు. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉండే విధానాన్ని పునరుద్ధరించట్లేదు. ఒక్కసారి క్యూలైన్లో అడుగు పెట్టిన భక్తుడు.. ఇక నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
టీటీడీ సిబ్బంది.. వారి కుటుంబ సభ్యులకు దర్శనం..
భక్తుల రాకపోకలను అనుమతించిన తరువాత తొలి మూడు రోజుల పాటు టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ సమయంలోనే క్యూ లైన్లలో గానీ, నివాస సముదాయాల్లో గానీ ఏవైనా లోటుపాట్లు తలెత్తితే వెంటనే సరిచేయడానికి మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తారని తెలుస్తోంది. అనంతరం తొలి రెండువారాల పాటు స్థానికులకు అంటే.. తిరుమల, తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలకు అనుమతి ఇస్తారు. ఆ తరువాతే మిగిలిన వారికి అవకాశం ఇస్తారు. క్యూలైన్లలో తలెత్తే ఇబ్బందులను పరీక్షించడానికి నిర్వహించే ట్రయల్ రన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రోజూ ఏడువేల మంది భక్తులు
అప్పట్లా స్వామివారి దర్శనానికి వేలాదిమందిని పంపించినట్లు ఈ సారి కుదరదు. పరిమితంగానే భక్తులను అనుమతిస్తారు. రోజూ ఏడు నుంచి ఎనిమిది వేల మంది భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాన్ని కల్పించేలా ఆన్లైన్ ద్వారా స్లాట్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో గంటకు గంటకు 500 మంది భక్తులకు ఈ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. దీని ప్రకారం.. రోజూ 14 గంటలు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. మిగిలిన సేవలను యధాతథంగా కొనసాగిస్తారు.