పరకామణి లోగుట్టు పెరుమాళ్లకెరుక: 40 మంది మజ్దూర్ల తొలగింపు: పెదవి విప్పని టీటీడీ పాలక మండలి!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరో వివాదాన్ని నెత్తినెత్తుకుంది. శ్రీవారి ఆలయానికి హుండీ రూపంలో వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ఉద్దేశించిన పరకామణి విభాగంలో ఉన్నఫళంగా 40 మంది మజ్దూర్లను తొలగించింది. ఇప్పటికే అప్రైజల్ లేకుండా కాలం గడిపేస్తున్న పరకామణి విభాగంలో తాజాగా 40 మంది మజ్దరూర్లను రాత్రికి రాత్రి తొలగించడంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై టీటీడీ అధికారులు గానీ, పాలక మండలి నోరు విప్పట్లేదు. టీటీడీ చరిత్రలోనే లేనివిధంగా అర్చకులకు పదవీ విరమణ వయస్సు నిబంధనను తీసుకొచ్చి, ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులకు మంగళం పలికింది టీటీడీ పాలక మండలి. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే 40 మంది మజ్దూర్లను తొలగించి, వివాదాలకు కేంద్రబిందువైంది.
ఆదాయం లెక్కింపులో మజ్దూర్లదే ప్రధానపాత్ర
కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచీ భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తమకు తోచిన విధంగా కానుకలను హుండీలో వేస్తుంటారు. నగదు రూపంలో వచ్చే ఆదాయమే ఒక్కరోజులో కనీసం రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, వారాంతపు రోజులు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో తిరుమలకు వచ్చే హుండీ ఆదాయం కనీసం మూడుకోట్ల రూపాయలను మించుతుంది. ఇంత పెద్ద మొత్తం అంతా నాణేలు, తక్కువ డినామినేషన్ గల రూపాల్లో లభిస్తుంటుంది.
రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని తక్కువ డినామినేషన్ గల నోట్ల ద్వారా లెక్కించాలంటే ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికోసమే- పరకామణిలో పెద్ద సంఖ్యలో మజ్దూర్లను నియమించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం టీటీడీకి కల్పించింది. ఈ నేపథ్యంలో- హుండీకి వచ్చే ఆదాయానికి అనుగుణంగా మజ్దూర్లను నియమించుకుంది. ఫలితంగా- పరకామణి సేవలు సజావుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 40 మందిని రాత్రికి రాత్రి తొలగిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. వారిని తొలగించి- సుమారు 24 గంటలు గడుస్తున్నప్పటికీ- ఈ వివాదంపై టీటీడీ అధికారులు ఎవ్వరూ స్పందించట్లేదు.
ఆరునెలలుగా అప్రైజల్ లేకుండానే..
శ్రీవారి హుండీలో నోట్లు, నాణేలే కాకుండా.. బంగారాన్ని కూడా వేస్తుంటారు భక్తులు. దీనితో పాటు- కిరీటాలు, నగల రూపాల్లో టీటీడీకి బంగారం భక్తుల నుంచి అందుతుంటుంది. వాటిని మదింపు చేయడానికి ఇదివరకు అప్రైజల్ వ్యవస్థ ఉండేది. సుమారు ఆరునెలల కిందట ఈ వ్యవస్థకు కూడా మంగళం పలికేసింది టీటీడీ. అప్రైజల్ వ్యవస్థ పరకామణి విభాగానికి అనుబంధంగా పనిచేస్తుండేది. దీన్ని రద్దు చేయడంతో, టీటీడీ ట్రెజరీకి వచ్చే బంగారాన్ని మదింపు చేసే వారే లేరు. అప్రైజల్ ను నియమించుకోవాల్సి ఉందంటూ అర్చకుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. ఏ మాత్రం పట్టించుకోలేదు టీటీడీ. దీనికి గల కారణాలను కూడా వివరించడానికి సిద్ధంగా లేదు.
మందగించిన పరకామణి సేవలు
ఒకేసారి 40 మంది మజ్దూర్లను తొలగించడం వల్ల పరకామణిలో సేవలు మందగించాయి. మునుపటి వేగం కనిపించట్లేదు. జల్లెడ పట్టి నాణేలను లెక్కించాల్సి ఉండగా.. ప్రస్తుతం ఉన్న సిబ్బంది ఆ పని చేయట్లేదు. నోట్లను మాత్రమే లెక్కిస్తున్నారు. నగదేతర కానుకలను లెక్కించకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఫలితంగా- 24 గంటల వ్యవధిలో కొండలా పేరుకుపోయాయి నగదేతర కానుకలు. నోట్ల లెక్కింపులో ఇప్పుడున్న సిబ్బందిపై పని భారం పడుతోంది. టీటీడీ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. తొలగించిన వారికి పునర్నియమించడమా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమా అనే విషయంపై త్వరగా తేల్చుకోవాలని చెబుతున్నారు. చాలినంత సిబ్బంది అంటూ లేకపోతే- తమపై పనిభారం తీవ్రంగా పడుతుందని పరకామణి సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతుందని, దీనికి అనుగుణంగా హుండీ రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో పరకామణి సేవలను కొనసాగించడం కష్టతరమౌతుందని అంటున్నారు.