కనక దుర్గ ఆలయంలో అవమానించారంటూ బొండా ఉమ అలక:టిటిడి పట్టువస్త్రాల సమర్పణలో వివాదం
విజయవాడ:విజయవాడ కనక దుర్గ అమ్మవారికి టిటిడి పట్టువస్త్రాల సమర్పణ వివాదానికి దారితీసింది. ఈ ఘట్టంలో తనను అవమానించారంటూ టిడిపి ఎమ్మెల్యే, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడైన బోండా ఉమ అలిగి వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది.
దీంతో తమ నాయకుడిని అవమానించారంటూ బోండా ఉమ అనుచరులు, దుర్గగుడి పాలకమండలి సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హడావుడి చేశారు. అయితే ఈ విషయంలో తమ తప్పేం లేదని ఈవో కోటేశ్వరమ్మ వివరణ ఇచ్చారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించి వ్యవహరించామని ఆమె స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే...
టిటిడి...పట్టువస్త్రాల సమర్పణ
దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారికి టిటిడి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలో టిటిడి ఎఈవో సాయిలు మంగళవారం టిటిడి నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకువచ్చారు. పట్టువస్త్రాలతో తరలివచ్చిన ఎఇఓ సాయిలుతో టిడిపి ఎమ్మెల్యే,టిటిడి టిటిడి ట్రస్ట్ బోర్డు మెంబర్ బొండా ఉమ కూడా ఆలయానికి వచ్చారు.
బోండా ఉమా...అలక
దీంతో ప్రొటోకాల్ ప్రకారం టిటిడి ఎఈవోకు దుర్గగుడి అధికారులు స్వాగతం పలికి, ఆయనకు తలపాగా కట్టి ఆహ్వానించారు. అయితే టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడైన తాను పక్కన ఉండగా ఏఈవోకు తలపాగా చుట్టి స్వాగతం పలకడంపై బొండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇలా చేయడాన్ని తనకు అవమానంగా భావించిన బోండా ఉమ దుర్గగుడి అధికారుల తీరును నిరసిస్తూ అలిగి వెళ్లిపోయారని సమాచారం.
ఈవో...వివరణ
దీంతో తమ నేతను కావాలనే అవమానించారంటూ బోండా ఉమ అనుచరులు, దుర్గగుడి పాలకమండలి సభ్యులపై మండిపడ్డారు. దీంతో వివాదం చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ వివరణ ఇచ్చారు.టిటిడి నుంచి ఎఈవో ద్వారానే పట్టువస్త్రాలను పంపుతున్నట్లు తమకు సమాచారం అందిందని , దీంతో ప్రోటోకాల్ ను అనుసరించి ఎఈవోకు తలపాగా కట్టామని, ఎమ్మెల్యే బొండాను ఏ విధంగానూ అవమానించలేదని ఆమె స్పష్టం చేశారు.
టిటిడి ఏఈవో...ఏమన్నారంటే?
దీనిపై టిటిడి ఎఈవో సాయిలు మాట్లాడుతూ దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించాలని టిటిడి అధికారులు తనను ఆదేశించారని తెలిపారు. పట్టువస్త్రాల సమర్పణ సందర్భంగా విజయవాడలోని టిటిడి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు బోండా ఉమాకు సమాచారం మాత్రమే ఇవ్వాలని సూచించారని, ఆ మేరకు బొండా ఉమకు సమాచారం ఇవ్వడం జరిగిందని తేల్చేశారు. అయితే ఈ వివాదంపై బోండా ఉమా స్పందన తెలియాల్సివుంది.