టిటిడిలో ఒంటిమిట్ట రామాలయం విలీనం, చదలవాడ బాధ్యత
కడప: కడప జిల్లాలోని పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కు అప్పగించారు. ఒంటిమిట్ట ఆలయంలో టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బాధ్యతలను స్వీకరించారు. ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తోంది.
ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయాన్ని టిటిడి ఆగమశాస్త్రం ప్రకారం అధికారికంగా టిటిడి విలీనం చేసుకుంది. బుధవారం ఈ విలీనం ప్రక్రియ జరిగింది.
ఈ విలీన ప్రక్రియకు టిటిడి పాలక మండలి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పసులేటి హరిప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడారు. ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రామాలయం వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేరినందున ఆలయాభివృద్ధికి ఎట్టి పరిస్థితులలో నిధుల కొరత రానివ్వమని చెప్పారు.
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు టిటిడి నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వ లాంఛనాలను తీసుకొస్తారన్నారు. మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్లో జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం చంద్రబాబు రూ.100కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారన్నారు. హామీలను టిటిడి పూర్తి చేస్తుందన్నారు.