టీటీడీలో విభేదాలు భగ్గు: శ్రీవారి దర్శనంపై పేచీ: జగన్ వద్దకు పంచాయితీ: రెండుగా చీలిన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. శ్రీవారి దర్శనాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ఈ విభేదాలు తలెత్తాయి. శ్రీవారి దర్శనాన్ని కొనసాగించే విషయంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు రెండుగా చీలిపోయారు. వారి మధ్య విభేదాలు తలెత్తాయి. అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. ఇదెక్కడిదాకా వెళ్తుందనేది.. ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దే తేల్చుకోవాలనే అభిప్రాయం రెండు వైపులా వినిపిస్తోంది.
రమణ దీక్షితులు బాంబు: ఆ పని చేయకపోతే వినాశనం తప్పదు: టీటీడీపై ఇంకా చంద్రబాబు పెత్తనం
అసలు కారణమేంటీ?
తిరుమల రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. ఇప్పటిదాకా 140 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. క్వారంటైన్లలో ఉంటున్నారు. వారిలోో 15 మంది శ్రీవారి ఆలయ అర్చకులు ఉన్నారు. శ్రీవారి పోటు ఉద్యోగులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఇదివరకు 91 మంది టీటీడీ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారని భావించినా.. ఆ సంఖ్య సరి కాదని.. అంతకుమించి 140 మంది అర్చకులు, ఉద్యోగులకు కరోనా సోకిందంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు.
రమణ దీక్షితులు ఏం చెబుతున్నారు..
ఈ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాన్ని కొనసాగించడం సరికాదంటూ టీటీడీ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీవారి దర్శనాన్ని కొనసాగించడం ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. స్వామివారి దర్శనాన్ని కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఙప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో సేవలందించే 50 అర్చకులకు కరోనా వైద్య పరీక్షలను నిర్వహించగా.. 15 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని రమణ దీక్షితులు చెప్పారు. మిగిలిన వారి నివేదికలు అందాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
వైవీ సుబ్బారెడ్డి వాదనేంటీ?
శ్రీవారి ఆలయంలో భక్తుల దర్శనాలను కొనసాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో భక్తుల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లు చేశామని అన్నారు. 140 మంది కరోనా బారిన పడగా.. సగం మంది కోలుకున్నారని అన్నారు. వయసు పైబడిన అర్చకులను ఇళ్లలోనే ఉండటానికి అనుమతి కోరుగా దానికి అంగీకరించినట్లు చెప్పారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులెవరికీ కరోనా పాజిటివ్ రాలేదని, వారి నుంచి ఉద్యోగులకు వైరస్ సోకలేదని స్పష్టం చేశారు.
భక్తుల నుంచి కరోనా సోకనప్పుడు ఎందుకు రద్దు?
భక్తుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందనప్పుడు శ్రీవారి దర్శనాలను ఎందుకు కొనసాగించకూడదనేది వైవీ సుబ్బారెడ్డి వాదన. టీటీడీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది చాలామంది తిరుపతి సహా వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారని, అక్కడి పరిస్థితు వల్లే వారికి కరోనా సోకిందని చెబుతున్నారు. భక్తుల ద్వారా టీటీడీ సిబ్బందికి లేదా అర్చకులకు కరోనా సోకితే.. దర్శనాలను నిలిపివేయడంలో అర్థం ఉంటుందని అంటున్నారు. ఆ పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.
Recommended Video
నేరుగా మాట్లాడి ఉండొచ్చు..
శ్రీవారి దర్శనాలను కొనసాగించే విషయంలో రమణ దీక్షితులు నేరుగా తనతో మాట్లాడి ఉండొచ్చని, అలాకాకుండా మీడియాకు ఎక్కడం సరి కాదని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. రమణ దీక్షితులుకు తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఈ విషయాన్ని ఆయన నేరుగా తనకే వివరించి ఉండొచ్చని చెప్పారు. అర్చకుల మేలును తాము కోరుకునే వాళ్లమే తప్ప ఇబ్బందులు పెట్టే వాళ్లం కాదని అన్నారు. అర్చకులు బాగుంటేనే భగవంతుడు సంతోషిస్తాడనే విషయాన్ని తాను నమ్ముతున్నానని చెప్పారు.