తెలంగాణ భద్రాచలంకు ధీటుగా ఏపీలోని ఒంటిమిట్ట రామాలయం
చిత్తూరు: కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకోవాలని ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తెలంగాణలోని భద్రాచలం ఆలయ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం నాడు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భద్రాచలంలో ఉన్న రామాలయానికి ధీటుగా కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శ్రీ సీతారాముల కళ్యాణం రెండు ప్రాంతాల్లో జరిగిన విషయం తెలిసిందే. విభజన తర్వాత ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాలలో పోటీ పడుతున్నారు. ఇటీవల గోదావరి పుష్కరాల విషయంలోను పోటీ పడినట్లుగా కనిపించిందనే వాదనలు వచ్చాయి.
అంతకుముందు, శ్రీరామ నవమి నాడు వేర్వేరుగా సీతారాముల కళ్యాణాలు నిర్వహించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్లో గోదావరి తీరాన గల భద్రాచలంలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన (జూన్ 2) అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెరాస, టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీతారాముల కళ్యాణం కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో అధికారికంగా నిర్వహించింది. విభజనలో భాగంగా భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
భద్రాచలంను ఏపీకి ఇవ్వాలని మొదట సీమాంధ్ర నేతలు పట్టుబడ్డారు. 1956కు ముందు భద్రాచలం ఏపీలో ఉండేదని, ఇప్పుడు కూడా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భౌగోళిక, ప్రజాభిప్రాయం... ఇలా పలు కారణాలతో భద్రాచలం తెలంగాణలో ఉండిపోయింది.
అయితే, భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతం పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. భద్రాచలం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన సీతారాముల కళ్యాణాన్ని అధికార తెరాస ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.