శ్రీవారి ఆస్తులపై టీటీడీ కీలక నిర్ణయం.. కేంద్ర మంత్రి నిర్మలతో చైర్మన్ వైవీ భేటీ..
''ప్రభుత్వం మారినా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో పరిస్థితులు మారలేదు. ఈవో, ఏఈవో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలనే పాటిస్తున్నారు. ప్రస్తుత సీఎం జగన్ మాట ఎవరూ వినట్లేదు..''అంటూ టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలకు దిగడంతో టీటీడీ లోపలి అంశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. సంస్థకు చెందిన వివిధ అంశాలు తరచూ వివాదాస్పదం అవుతుండటంతో ఈవో అనిల్ సింఘాల్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అంతలోనే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అయ్యారు. శ్రీవారి ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం విశేషం. ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడిన సింఘాల్.. వివాదాలకు తావులేకుండా పూర్తి స్థాయి పరిశీలన తర్వాత శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.
లాక్డౌన్ సడలించిన తర్వాత జూన్ 11నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయని, నెల రోజుల వ్యవధిలో(జూలై 10 వరకు) మొత్తం 2,50,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, అందులో 82,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, తలనీలాల విలువ పెరగడంతో రూ.7 కోట్ల ఆదాయం అదనంగా సమకూరిందని, హుండీ ఆదాయం రూ. 16.73 కోట్లు వచ్చిందని, ఈ వ్యవధిలో 13.36 లక్షల లడ్డూలు విక్రయించామని ఈవో సింఘాల్ వివరించారు.
Recommended Video
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం కోరుతూ డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో టీటీడీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. కాగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏయే అంశాలపై మాట్లాడారు, ఆస్తుల ప్రకటనపై వారు చర్చించారా అనేది వెల్లడికావాల్సి ఉంది.