యస్ బ్యాంకు మునిగిపోతుందనే సమాచారం టీటీడీకి ముందే తెలుసా?: 900 కోట్లు విత్ డ్రా
తిరుపతి: ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన యస్ బ్యాంకు ప్రస్తుతం ఎదుర్కొంటోన్న సంక్షోభ పరిస్థితులను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముందే పసిగట్టిందా? అంటే అవుననే అనుకోవచ్చు. ఎందుకుంటే- కొన్ని నెలల కిందటే ఆ బ్యాంకు నుంచి సుమారు 900 కోట్ల రూపాయల శ్రీవారి డిపాజిట్లను టీటీడీ పాలక మండలి ఉపసంహరించుకుంది.. ఏక మొత్తంగా. ఒకేసారి 900 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకుంది. ఈ డిపాజిట్ల మొత్తాన్ని కొనసాగించాలంటూ ఒత్తిళ్లు వచ్చాయని, అయినప్పటికీ.. ఖాతరు చేయలేదని అంటున్నారు.
ఖాతాదారుల కొంపముంచిన యస్ బ్యాంకు: విత్ డ్రాలపై పరిమితి: రిజర్వుబ్యాంకు ఆధీనంలోకి.. !
ఆర్బీఐ ఆంక్షలతో కలకలం..
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న ఈ బ్యాంకును రిజర్వుబ్యాంకు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నగదు ఉపసంహరణపైనా ఆంక్షలను విధించింది. ఇకపై ఖాతాదారులు తమ అకౌంట్ల నుంచి 50 వేల రూపాయల వరకు మాత్రమే నగదును ఉపసంహరించుకోవాల్సి ఉంటుందంటూ రిజర్వుబ్యాంకు నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చేనెల 3వ తేదీ వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.
ముందే మేల్కొన్న టీటీడీ..
యస్ బ్యాంకు దుస్థితిని గమనించిన టీటీడీ ముందే మేల్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో యస్ బ్యాంకుతో సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోకి డిపాజిట్లు వేశారని అంటున్నారు. ఒక్క యస్ బ్యాంకులోనే 900 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లు పాలక మండలి నిర్ధారించిందని తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ నాలుగు ప్రైవేటు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులపై నివేదికను తెప్పించుకున్నారని అంటున్నారు. యస్ బ్యాంకుపై ఆరా తీసిన ఆయన డిపాజిట్ల మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేశారని సమాచారం.
మిగిలిన ప్రైవేటు బ్యాంకుల నుంచీ విత్ డ్రా..
వెంకటేశ్వరస్వామి వారికి భక్తులు వివిధ రూపాల్లో అందించే కానుకలను వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. స్వామివారికి కానుకల రూపంలో అందిన బంగారాన్ని కరిగింది.. నాణేలుగా డిపాజట్ చేస్తుంటారు. జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుందంటూ ఇదివరకు టీటీడీ పాలక మండలి ఓ తీర్మానాన్ని రూపొందించుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ నిబంధనను సడలించారు.
మిగిలిన ప్రైవేటు బ్యాంకుల నుంచీ వెనక్కి..
యస్ బ్యాంకు వంటి నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేశారని తెలుస్తోంది. యస్ బ్యాంకు సంక్షోభంలో పడిన అనంతరం మిగిలిన మూడు ప్రైవేటు బ్యాంకుల నుంచి కూడా డిపాజిట్లను వెనక్కి తీసుకోవచ్చని అంటున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాన్ని తీసుకోవచ్చని సమాచారం. ఒకవేళ- ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ.. డిపాజిట్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయం టీటీడీ పాలక మండలి సభ్యుల్లో వ్యక్తమౌతున్నట్లు చెబుతున్నారు.