రేవంత్ మంచి నాయకుడు, లేకపోవడం నష్టమే, కానీ పార్టీ గొప్పది: టీటీడీపీ నేతల స్పందన
రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన లేకపోవడం పార్టీకి లోటేనని, అయితే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని వ్యాఖ్యానించారు.
అమరావతి: రేవంత్ రెడ్డి రాజీనామా వ్యవహారంపై టీటీడీపీ నేతలు స్పందించారు. ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీపీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగియగానే వారు బయటికొచ్చారు.
ఈ భేటీ అనంతరం అమరావతిలో మీడియాతో టీటీడీపీ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, సండ్ర, నామా నాగేశ్వర రావు, పెద్ది రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రాజీనామాపై స్పందించారు.
రేవంత్ రెడ్డి మంచి నాయకుడని, ఆయన లేకపోవడం పార్టీకి లోటేనని, అయితే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని వ్యాఖ్యానించారు. రేవంత్ మర్యాద పూర్వకంగానే పార్టీని వీడినట్లు చెప్పారు.
ఆయన తన రాజీనామా లేఖలో ఎవ్వరిపై ఎటువంటి ఆరోపణలు చేయలేదని టీటీడీపీ నేతలు స్పష్టంచేశారు. తాను వ్యక్తిగతంగా ఎదురైన పలు ఇబ్బందుల కారణంగానే పార్టీని వీడుతున్నాను అని రేవంత్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇక ఇందులో అనుకోవడానికి కానీ, చర్చిండానికి కానీ ఏమీ లేదు అని పెద్ది రెడ్డి, సండ్ర వంటి నేతలు మీడియాకు చెప్పారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో రేవంత్ రెడ్డి రాజీనామాపై ఏమైనా అంశాలు ప్రస్తావనకొచ్చాయా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అటువంటిదేమీ లేదని చెప్పారు.
విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే ముందు తమతో రేవంత్ మర్యాద పూర్వకంగా మాట్లాడారని అన్నారు. ఆయనపై ఎలాంటి అభియోగాలు లేవని, పార్టీ వీడటం రేవంత్ వ్యక్తిగత నిర్ణయమన్నారు.