ప్రభుత్వం చేతికి టీటీడీ గెస్ట్హౌస్: శ్రీవారి భక్తులకు కాదు పేషెంట్లకు: అనంతలో ఢిల్లీ రేంజ్లో
తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చిత్తూరు జిల్లాల్లో రోజురోజుకూ పెరిగిపోతోన్న కరోనా వైరస్ బారిన పడుతోన్న పేషెంట్ల కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అతిథిగృహాలను తీసుకుంటోంది. వాటిని కోవిడ్ సెంటర్లుగా మార్చేస్తోంది. టెంపుల్ టౌన్ తిరుపతిలో ఇప్పటికే రెండు వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో.. టీటీడీ అధికారులను ఒప్పించి.. వాటిని తన ఆధీనంలోకి తీసుకుంటోంది.
విష్ణు నివాసాన్ని కోవిడ్ సెంటర్గా
తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం గెస్ట్హౌస్ను కోవిడ్ సెంటర్గా మార్చివేశారు జిల్లా అధికారులు. అక్కడున్న భక్తులను ఖాళీ చేయించారు. ఆదివారం నుంచి ఈ అతిపెద్ద గెస్ట్హౌస్ను కరోనా వైరస్ పేషెంట్ల సెంటర్గా బదలాయించారు. సుమారు 400లకు పైగా పడకలను ఇందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్ల కోసం ఏర్పాటు చేశారు. తిరుపతి సహా పొరుగు ప్రాంతాలకు చెందిన కరోనా పేషెంట్లను విష్ణు నివాసానికి తీసుకొస్తున్నారు.
బర్డ్ కూడా..
స్విమ్స్ శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల ఆసుపత్రికి అనుబంధంగా పని చేస్తోన్న బర్డ్ ఆసుపత్రిని సైతం ప్రభుత్వానికి ఇవ్వడానికి టీటీడీ అంగీకరించింది. త్వరలోనే దీన్ని కూడా కోవిడ్ సెంటర్గా మార్చబోతున్నారు. చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం నాటికి 4207 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 343 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాల్లో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. ఇప్పటిదాకా 44 మంది మృతిచెందారు.
అనంతలో అతిపెద్ద కోవిడ్ సెంటర్..
అనంతపురం జిల్లాలో అతిపెద్ద కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఢిల్లీ ఛత్తార్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ బియాస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ తరహాలో.. అనంతపురంలో ఓ భారీ కేంద్రాన్ని నెలకొల్పబోతోంది. 1500 పడకలతో దీన్ని ఏర్పాటు చేయబోతోంది. రాప్తాడు సమీపంలోని రామినేపల్లి వద్ద పౌర సరఫరాల సంస్థకు చెందిన గోడౌన్ను దీనికోసం వినియోగించుకోబోతోంది. ప్రస్తుతం సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
Recommended Video
ల్యాబ్స్ కూడా..
పేషెంట్లకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహించడానికి ఈ గోడౌన్లో రెండు క్లినికల్ ల్యాబోరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. అందులో ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలను నిర్వహిస్తారు. ఇక రోగులకు భోజనం కోసం ప్రత్యేకంగా వంట గదిని ఏర్పాటు చేస్తున్నారు. సెంటర్లో విద్యుత్, నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దీనికోసం ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.