ప్రజాస్వామ్యంపై అత్యాచారం, జాతికి అవమానం: తులసి
ఈ అవమానం అత్యాచారం, హత్యాయత్నం ఎవరు చేశారని ప్రశ్నించిన ఆయన, దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటులోనే ఇవన్నీ జరిగాయని ఆరోపించారు. దీనికి దుష్ట చతుష్టయం సహకరించిందని, అది ఎవరంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలే అని అన్నారు.
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే ముఖ్యమంత్రి పదవిని కిరణ్ కుమార్ రెడ్డి వదులుకున్నాడని చెప్పారు. తెలుగుజాతికి 2500ఏళ్ల చరిత్ర ఉందని తులసి రెడ్డి చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, అభిమానానికి ప్రతీక అని ఆయన తెలిపారు. తెలుగుజాతి ఎంతో మంది మేధావులను, స్వాతంత్ర్యాన్ని సమరయోధుల్ని దేశానికి అందించిందని చెప్పారు.
తెలుగు జాతి ఔన్నత్యం కోసమే మా పార్టీ: పితాని
తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకే జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భవించిందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. తమ పార్టీ రాజకీయ పార్టీ కాదని ఉద్యమ పార్టీ అని ఆయన చెప్పారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పార్టీ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఖూనీ చేశాయని ఆరోపించారు.
ప్రపంచంలోని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పడిందని ఆయన చెప్పారు. దేశ సమగ్రతను, రాష్ట్ర సమైక్యతను కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని పితాని సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర విభజన జరగలేదని చెప్పిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.