మేనమామ కాకున్నా పర్లేదు శకుని మామ కావొద్దు: ఏపీ సీఎం వైఎస్ జగన్పై తులసీరెడ్డి ఫైర్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు. రాష్ట్రంలో విద్యార్థులందరికీ మేనమామను అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తులసీ రెడ్డి పిల్లలందరికీ మేనమామ కాకున్నా పర్వాలేదు కానీ శకుని మామ మాత్రం కావొద్దని ఆయన హితవు పలికారు.
ఇక అంతే కాదు మాతృభాషను హత్య చేసిన ఈ హంతక ప్రభుత్వానికి అమ్మ అని పలికే అర్హత లేదని అన్నారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టటం తప్పు కాదు కానీ తెలుగు మీడియం తీసివేత మాత్రం కచ్చితంగా తప్పని తులసీ రెడ్డి పేర్కొన్నారు. ఇది 'అమ్మ ఒడి' కాదని, 'మమ్మీ ఒడి' అని ఎద్దేవా చేశారు. జగన్ కు ఆంగ్లంపై అంత మోజుంటే తన పేపర్ ను ఆంగ్లంలోనే ప్రచురించాలని సవాల్ విసిరారు.అలా కాకుండా తెలుగులో ప్రచురించటం దేనికి అని ఆయన ప్రశ్నించారు. ఇక అంతే కాదు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను, అన్ని సంక్షేమ పథకాల నిధులను 'అమ్మ ఒడి'కి మళ్లించారని తులసిరెడ్డి ఆరోపించారు.
ఇక గతంలో సీఎం కేసీఆర్ తో స్నేహ సంబంధాలపై కూడా జగన్ పై మండిపడిన తులసీ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ ఏపీని తెలంగాణకు తాకట్టు పెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కావాలంటే తన ఆస్తులు కేసీఆర్ కు ధారాదత్తం చెయ్యొచ్చని కానీ ప్రజా సొమ్మును ఇవ్వటం మాత్రం దారుణం అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చేతిలో కీలు బొమ్మ కావోద్దని హితవు పలికారు. ఇక ఇప్పుడు అమ్మ ఒడి పథకం విషయంలో ఆయన జగన్ పై వ్యాఖ్యలు చేశారు.