బీజేపీ వైపు చూస్తున్న కడప జిల్లా నేత తులసి రెడ్డి
కడప జిల్లాకు చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. అంచలంచెలుగా ఎదిగి బిజెపి, కాంగ్రెస్, సమైక్యాంధ్ర పార్టీల్లో కీలక పదవులు పొందారు. తెలుగుదేశం పార్టీలో ఉండగా కడప జడ్పీ చైర్మన్ పదవిని చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ హోదా కలిగిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. తరువాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా ఆయన స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాత పరిచయాలతో పార్టీ పెద్దలతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
విభజన, ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి దారుణంగా ఉండటం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఏపీ, తెలంగాణల్లో పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే.