కేసీఆర్ మాయలో పడొద్దు జగన్ .. ఏపీపై కేసీఆర్ ది ఆది నుండీ వివక్షే అన్న తులసీ రెడ్డి
ఇప్పుడు ఏపీలో కేసీఆర్, జగన్ ల స్నేహం మీద హాట్ టాపిక్ నడుస్తుంది. నదీ జలాల ఒప్పందాల విషయంలో , వివాదాల్ని పరిష్కరించే విషయంలో జగన్ గుడ్డిగా కేసీఆర్ ను నమ్ముతున్నారని ప్రత్యర్ధి పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేసీఆర్ ఆది నుంచి వివక్ష చూపుతూనే ఉన్నారని అది ఇంకా కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. అలాంటి సమయంలో జగన్ కేసీఆర్ ను నమ్మటం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
హిట్లర్ కేసీఆర్ కాస్తా భగీరధుడయ్యారా...నోటుకి నీళ్ళా ... జగన్ పై లోకేష్ ఫైర్
జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని హితవు చెప్పిన తులసీ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ మాయలో పడొద్దని హితవు పలికారు తులసీరెడ్డి . అంతే కాదు కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటని నిలదీశారు. ఇప్పటికే కృష్ణమ్మను బంధించిన కేసీఆర్ గోదావరిని కూడా బంధించాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. జగన్ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రోజూ ఏదోఒక చోట రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విత్తన కొరతే నివారించలేకపోయింది అంటూ మండిపడ్డారు .
రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్ట్ లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్న తులసీ రెడ్డి
ఇకనైనా రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రైతులకు రుణాలు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో సాగునీరు విడుదల చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తులసిరెడ్డి వైయస్ జగన్ ను కోరారు.పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించేలా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ తో జగన్ స్నేహంపై ప్రతిపక్ష పార్టీల హెచ్చరిక .. అంత ఉదార స్వాభావం కేసీఆర్ కు లేదని హితవు
కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ స్నేహం ఏపీలోని ప్రతిపక్ష పార్టీలకు ఏ మాత్రం నచ్చటం లేదు. అందుకు కారణం లేకపోలేదు. మొదట నుండీ కేసీఆర్ ఏపీ పట్ల వివక్షతోనే మాట్లాడారు. ఏపీ అభివృద్ధి విషయంలో , గతంలో విభజన సమయంలో ఏపీకి రావాల్సినవి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఇక నీటి పంపిణీ విషయంలో, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కూడా కయ్యానికి కాలు దువ్వారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ఏపీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తారంటే ఏపీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఒకటికి పది సార్లు కేసీఆర్ తో జాగ్రత్త అని జగన్ ని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ మాయలో పడొద్దని సలహా ఇస్తున్నారు.