చంద్రబాబుపై ముద్రగడ పైచేయి: నెరవేరిన చిరంజీవి-దాసరి కోరిక!
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పైచేయి సాధించారా? అంటే అవుననే అంటున్నారు. కాపు విధ్వంసం ఘటనలో పదమూడు మందికి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
నాలుగు రోజుల క్రితం పది మందికి, తాజాగా మరో ముగ్గురికి బెయిల్ వచ్చింది. అందరికీ బెయిల్ కావాల్సిందేనని పట్టుబట్టిన ముద్రగడ దానిని సాధించారు. తద్వారా, బాబు పైన ఆయన పైచేయి సాధించారని అంటున్నారు.
తుని ఘటనలో పదమూడు మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో పన్నెండు రోజుల క్రితం ముద్రగడ దీక్షకు దిగారు. అరెస్టైన వారంతా అమాయకులను, వారిని విడుదల చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు, ప్రభుత్వం మాత్రం విడుదల చేసేది లేదని తొలుత ఖరాఖండిగా చెప్పింది. పూర్తి సాక్ష్యాధారాలతో నిందితులను అరెస్టు చేశామని, వీడియో పుటేజీ కూడా ఉందని మంత్రులు, టిడిపి నేతలు పలుమార్లు చెప్పారు. ముద్రగడ దీక్ష పైన డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరించారు.
కానీ, ముద్రగడ మాత్రం తన దీక్షను అలాగే కొనసాగించారు. తద్వారా ప్రభుత్వం దిగిరాక తప్పలేదని అంటున్నారు. తన డిమాండ్ నెరవేరిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం ఇక దీక్ష విరమించే అవకాశముంది.
ముద్రగడ దీక్ష విరమిస్తే కాపు నేతల డిమాండ్ కూడా నెరవేరినట్లవుతుంది. కాపు నేతలు చిరంజీవి, దాసరి నారాయణ రావు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు పదేపదే ముద్రగడ దీక్ష ప్రభుత్వం విరమింప చేసే చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. ముద్రగడ దీక్ష విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తాము కార్యాచరణ ప్రకటిస్తామని కూడా హెచ్చరించారు.