చంద్రబాబును టార్గెట్ చేసిన పురంధేశ్వరి: జంప్ జిలానీలే... టిడిపి అనుమానం
విజయవాడ: వైసిపి నుంచి గెలిచిన టిడిపిలో చేరి, ఆ తర్వాత మంత్రులైన 4గురు ఎమ్మెల్యేల అంశం వైసిపితో పాటు టిడిపి, బిజెపిలో కూడా కలకలం రేపుతోంది. తమ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరి, వారు మంత్రులు కావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరోవైపు, వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఇలా జరిగిందని, ఇతర రాష్ట్రాల్లోను ఇలాంటి చేరికలు ఇప్పుడు సహజం అయ్యాయని చెబుతూ తెలుగుదేశం పార్టీ సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ అంశం టిడిపి, వైసిపిలతో పాటు బీజేపీలోను కలకలం రేపుతోంది.
బీజేపీ రెండుగా..!
ఓ విధంగా చెప్పాలంటే ఏపీ బీజేపీ రెండుగా అయినట్లు కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వైసిపి నుంచి గెలిచి మంత్రులుగా కావడాన్ని కొందరు బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరికొందరు బిజెపి నేతలు ఈ అంశంపై మౌనంగా ఉన్నారు.
ఏపీలో టిడిపి, వైసిపిలకు ధీటుగా కమలం పార్టీ నిలబడాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అధిష్టానం సూచనల మేరకే పురంధేశ్వరి లేఖ రాసి ఉంటారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అదే సమయంలో పురంధేశ్వరి లేఖ రాసి ఒక రోజు దాటినా ఏపీ బీజేపీ నుంచి పెద్దగా స్పందన లేదు.
టార్గెట్ చంద్రబాబు
దీంతో ఏపీ బీజేపీ తెలుగుదేశం అనుకూల, తెలుగుదేశం వ్యతిరేక వర్గాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇంకో విషయం కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలే చంద్రబాబు ప్రభుత్వాన్ని మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే విమర్శించడం వెనుక..
పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి నేతలు తొలి నుంచి టిడిపిని టార్గెట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న నేతలు మాత్రం పెద్దగా కౌంటర్ చేయడం లేదు. ఒక్క సోము వీర్రాజు మాత్రం వీరికి జత కలిసిన సందర్భాలు ఉన్నాయి.
గతంలో ప్రత్యేక హోదా, ప్యాకేజీ తదితర అంశాల మీద పై నేతలు టిడిపిపై దుమ్మెత్తిపోశారు. అయితే, ఇన్నాళ్లు హోదా - ప్యాకేజీ అంశం వారిని ఇరుకున పడేసింది. ప్యాకేజీ చట్టబద్దతకు కేంద్రం ఓకే చెప్పడంతో మళ్లీ ఆ నేతలు టిడిపిపై విరుచుకు పడుతున్నారు.
ముఖ్య నేతలు స్పందించటం లేదు
ఇప్పుడు, వైసిపి నుంచి గెలిచిన అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు మంత్రి పదవి ఇవ్వడాన్ని పురంధేశ్వరి లేవనెత్తారు. అధిష్టానానికి లేఖ రాశారు. ఆమెకు బీజేపీ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు బుధవారం దీనిపై స్పందించారు. నేను ముఖ్యమంత్రిని అయి ఉంటే వారితో రాజీనామా చేయించేవాడినని వ్యాఖ్యానించారు.
అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షులు, విశాఖ ఎంపీ హరిబాబు, సోము వీర్రాజు వంటి నేతలు ఇంకా స్పందించలేదు. మొదటి నుంచి టిడిపిని తప్పుబడుతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి అనుమానం
కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే ఎక్కువగా విమర్శలు చేయడంపై టిడిపి నేతలు కూడా స్పందిస్తున్నారు. జగన్ - కాంగ్రెస్ ఎప్పటికైనా ఒకటి అవుతుందని, లేదంటే వైసిపిలో చేరుతారని, అందుకే అలా మాట్లాడుతున్నారని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు.
పురంధేశ్వరి అంత ఘాటుగా లేఖ రాసినా బీజేపీ నుంచి ఎందుకు స్పందన లేదు? టిడిపి మిత్ర పక్షం కాబట్టి ఊరుకుందా? లేక టిడిపి నేతలు చెప్పినట్లు ఇతర రాష్ట్రాల్లో బీజేపీ కూడా అదే పని చేసింది కాబట్టి పెద్దగా స్పందించడం లేదా? లేదా నిజంగానే అధిష్టానం వ్యూహంలో భాగంగానే పురంధేశ్వరి లేఖ రాశారా? అనే చర్చ జరుగుతోంది.
ఈ అంశంపై నిజానికి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఈ అంశంపై స్పందించాల్సి ఉందని, అయితే, ఆయనకు తెలుగుదేశం నాయకత్వంతో ఉన్న మొహమాటాల వల్ల ఏమీ మాట్లాడటం లేదని, తాము మాట్లాడితే తమపై తెలుగుదేశం వ్యతిరేక ముద్ర వేస్తారని, అందువల్ల తాము కూడ-ా మాట్లాడటం లేదని బీజేపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట.