కేసీఆర్ ఇంటి ఎదుట ధర్నా: టీవీ యాంకర్ శ్వేత అరెస్ట్!
ముఖానికి నల్లటి గుడ్డ కట్టుకొని, చేతిలో ప్లకార్డు పట్టుకొని ఆమె మౌన ప్రదర్శనతో నిరసన తెలిపారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, తెలంగాణలో ఐబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసరారాల పైన నిషేధం ఎత్తివేయాలని కోరుతూ పలువురు మీడియా ప్రతినిధులు శనివారం తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసం ముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు సాగిన ఈ నిరసన కార్యక్రమంలో మీడియాను రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని నినాదాలు చేశారు.
విలేకరులు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు తెలియజేసే మీడియా గొంతు నొక్కడం సమంజసం కాదని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన మార్గం వద్ద విలేకరులు ధర్నా చేస్తుండటంతో సీఎంను కలిసేందుకు వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వెనుక వైపు ద్వారం నుంచి లోనికి వెళ్లాడు. తెరాస ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్ ధర్నా చేస్తున్న విలేకరుల వద్దకు వచ్చారు. విలేకరులు ప్రశ్నించగా.. చర్చిద్దామని వారు లోపలకు వెళ్లారు. కాగా, కేసీఆర్ ప్రధానమంత్రిని కలవాల్సిన సమయం దగ్గర పడడంతో... వెనుక ద్వారం నుంచి బయటకు వెళ్లిపోయారని సమాచారం.