మౌన ముని! నిజాలన్నీ కక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు: నోరు మెదపని చంద్రబాబు!
విజయవాడ: తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలు రెండురోజులుగా సోషల్ మీడియా వేదికగా యుద్ధానికి దిగారు. వారిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపుతున్నారు. పాతరేసిన నిజాలను దగ్గరుండి మరీ వెలికి తీస్తున్నారు. ఒకరినొకరు తవ్విపోసుకుంటున్నారు. అప్పుడెప్పుడు దివంగతుడైన లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగినీ రచ్చలోకి లాగారు. ఇంతా జరుగుతున్నప్పటికీ- పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపట్లేదు. తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ ఎపిసోడ్తో సంబంధం లేనట్లు ఉంటున్నారు. పార్టీ అధినేత అయివుండీ- ఆ ఇద్దరు నేతలను కట్టడి చేయడానికి ఆసక్తి చూపట్లేదు.
నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు
— Kesineni Nani (@kesineni_nani) July 14, 2019
నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు.
నాలుగు పదాలు చదవలేనివాడు
నాలుగు వాక్యాలు రాయలేనివాడు
Tweet చేస్తున్నాడు.
దౌర్భాగ్యం!
నిజాలను వెల్లగక్కుతున్న తెలుగు తమ్ముళ్లు
ఆ ఇద్దరు నేతలు- విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, అదే నగరానికి చెందిన శాసన మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న. ఎక్కడ తేడా కొట్టిందో గానీ.. వారిద్దరి మధ్య రెండురోజులుగా ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులను సంపాదిస్తున్నాడంటూ ఈ ట్వీట్స్ వార్కు తెర తీశారు కేశినేని నాని. ఆయన సంధించిన మొట్టమొదటి ట్వీట్ చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించేనంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ వెంటనే- స్పష్టంగా అర్థమయ్యేలా బుద్ధా వెంకన్నను దృష్టిలో పెట్టుకుని ఆయన ట్వీట్లు చేశారు. `రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు
గుళ్ళో కొబ్బరిచిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి,కాల్ మనీ గాళ్ళకి, సెక్స్ రాకెట్ గాళ్ళకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం. నాకు అవసరం లేదు.` అంటూ ఆయన చేసిన ట్వీట్ ఈ సారి నేరుగా బుద్ధా వెంకన్నకే తగిలింది.
పెంపుడు కుక్కగా సంబోధిస్తూ..
బుద్ధా వెంకన్నను పెట్ డాగ్ (పెంపుడుకుక్క)గా సంబోధిస్తూ కేశినేని నాని చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. తన పెట్డాగ్ను నియంత్రణలో పెట్టుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి చేసిన ట్వీట్తో అప్పటిదాకా ఉన్న ప్రకంపనలు కాస్తా పతాక స్థాయికి చేరుకున్నాయి. తనలాంటి నాయకులు పార్టీకి అవసరం అనుకుంటే- పెంపుడు కుక్కలను వెంటనే నియంత్రించుకోవాలని ఆయన చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనిపై ఒకట్రెండు జాతీయ ఛానళ్లు సైతం స్పందించాయి. దీనిపై కథనాలను ప్రసారం చేశాయి.
కేశినేని బస్సుల బాగోతాన్ని బయటపెట్టిన బుద్ధా..
కేశినేని నానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో బుద్ధా వెంకన్న ఇప్పటిదాకా ఆయన గురించి తెలియని కుంభకోణాలను వెల్లగక్కేశారు. లోక్సభ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కేశినేని నాని కాజేశారని ఆరోపించారు. అందుకోసమే బాలయోగిని హత్య చేయించారనీ చెప్పుకొచ్చారు. బాలయోగి చనిపోయిన తరువాత వందలకోట్ల రూపాయల మిషనరీల డబ్బులను కేశినేని కొట్టేశారనీ విమర్శించారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు, ఒకే నంబర్పై పలు బస్సులను నడిపించారనీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకుని సొంతంగా దొంగ రశీదులను సృష్టించుకున్నారని, వాటి ద్వారా ఫైనాన్స్ కంపెనీలకు కోట్లాది రూపాయల మేర మోసం చేశారని ధ్వజమెత్తారు.
Recommended Video
కడుపు చించుకుంటే పడేది కాళ్ల మీదే..
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనే సామెతను నిజం చేస్తున్నారు వారిద్దరూ. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. రెండు రోజులుగా ఈ వ్యవహారం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అయినప్పటికీ- చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై ఎక్కడా నోరువిప్పట్లేదు. మౌనాన్ని ఆశ్రయించారు. దానికదే సర్దుకుంటుందనే వైఖరిలో ఆయన ఉన్నారు. వేచి చూసే ధోరణిని పాటిస్తున్నారు. ఒకవంక పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఆ ఇద్దరు నేతలు ప్రవర్తిస్తున్నప్పటికీ- చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వెనుక ఉద్దేశపూరక కారణాలు ఉన్నాయనే అంటున్నారు. తాను ఏ మాత్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా, అది మరింత రచ్చ, రచ్చ అవుతుందనే కారణంతో చంద్రబాబు మౌనమునిలా మారారని అంటున్నారు.