జంట తుఫాన్ల జల పడగ: పొంచివున్న పెను ముప్పు: నివార్, గతి: భారీ వర్షాలతో అల్ల కల్లోలమే
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు పెను తుఫాన్ ముప్పు పొంచివుంది. ఇప్పటికే అతి భారీ వర్షాలతో తొణికిసలాడుతోన్న ఏపీ, తెలంగాణలపై జంట తుఫాన్లు జల పడగను విప్పబోతోన్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండంగా మార్పు చెందాయి. ఆ స్థితి నుంచి మరింత ఉగ్ర రూపాన్ని సంతరించుకోబోతోన్నాయి. తుఫాన్గా అవతరించనున్నాయి. ఈ రెండు తుఫాన్ల వల్ల ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Recommended Video
ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీ
బంగాళాఖాతంలో నివార్..
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్కు నివార్గా నామకరణం చేశారు. ఇరాన్ ఈ పేరును సూచించింది. తొలుత అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారింది ఇది. క్రమంగా పశ్చిమం వైపు కదులుతోంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. బుధవారం నాటికి తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడింంచారు. ఫలితంగా- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.
వంద కిలోమీటర్లకు పైగా..
నివార్ తుఫాన్ తీరాన్ని దాటే సమయంలో వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ఏపీ విభాగం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. నివార్ వల్ల అనివార్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. బుధ, గురు వారాల్లో ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ కోస్తా తీర ప్రాంత జిల్లాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నంలల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
అరేబియాలో మరో తుఫాన్..
అదే సమయంలో అరేబియా సముద్రంలో మరో తుఫాన్ ఆవిర్భవించబోతోంది. దానికి గతిగా పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు దక్షిణ ప్రాంత జిల్లాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో రామనాథపురం, కరైకల్, పుదుకోట్టై, నాగపట్టిణం, తంజావూర్, కడలూర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాల్సి ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. నివార్, గతి దాదాపు ఒకే సమయంలో తుఫాన్ తీరాన్ని దాటే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.
వచ్చే నాలుగు రోజులూ..
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావం వల్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. వచ్చే నాలుగు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 23, 24 తేదీల్లో తమిళనాడు కోస్తా తీర ప్రాంత జిల్లాలు, కరైకల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని అన్నారు. 23 నుంచి 27వ తేదీ వరకూ దశలవారీగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం క్రమంగా వాయుగుండంగా మారడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.