డెన్ ఆఫ్ డెవిల్గా ట్విన్ ఆఫ్ హౌస్.. ఆ పాపం చంద్రబాబుదే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు
శాసనసభ చేసిన చట్టాలను ఆమోదించాల్సిన మండలి అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే ప్రభుత్వం మండలి రద్దు నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టంచేశారు. మండలి నియామకం, రద్దుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన కోట్ చేశారు. గతంలో వద్దని చెప్పినా.. చంద్రబాబు ఇప్పుడు రద్దుచేసే ప్రక్రియకు ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
శాసనసభ, శాసనమండలి ట్విన్ ఆఫ్ హౌస్ అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు సభల మధ్య వీడదీయరాని అవినాభావ సంబంధం ఉంటుందని గుర్తుచేశారు. కానీ ట్విట్ ఆఫ్ హౌస్ను డెన్ ఆఫ్ డెవిల్గా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మార్చారని దుయ్యబట్టారు. 1996లో శాసనసభలో ఎన్డీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. నేడు శాసనమండలిలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆరోపించారు.
కీలక బిల్లులు కూడా..
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లుతోపాటు ఇంగ్లీష్ మీడియా, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లును కూడా మండలిలో అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ రెండు బిల్లులను అడ్డుకొని ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ఆమె పప్రశ్నించారు. ఎస్టీ, ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకొని ఆ సామాజికవర్గాలకు ద్రోహం చేశారని ఆరోపించారు. మీరు చేసే తప్పులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
అందుకే 20 సీట్లు
పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టి.. బలహీనవర్గాలకు మేలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకొన్నారని భాగ్యలక్ష్మీ చెప్పారు. శాసనభలో ఆమోదం పొందిన బిల్లును కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. పేద పిల్లల కోసం తీసుకొచ్చిన బిల్లును కూడా అడ్డుకోవడం సరికాదన్నారు. టీడీపీ ప్రభుత్వ పనితీరును గమనించి ప్రజలు 20 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. కానీ వారి అధినేత చంద్రబాబు నాయుడు వైఖరి మాత్రం మారలేదన్నారు.