గంగిరెడ్డి కేసులో కొత్త మలుపు: హత్య కేసులో అరెస్ట్ వారెంట్ జారీ
కడప: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్ది కేసు కొత్త మలుపు తిరిగింది. రెండు దశాబ్దాల క్రితం నమోదైన అంబటి మరళీమోహన్ రెడ్డి హత్యా కేసులో గంగిరెడ్డిపై కడప కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసులు తవ్వి తీశారు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ను గత ప్రభుత్వం మాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కీలకమైన సమాచారం అందడంతో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగి పూర్తి వివరాలను సేకరించారు.
1992లో కడప జిల్లాకు చెందిన వ్యాపారి అంబటి మురళీమోహన్రెడ్డి అనే వ్యక్తిని గంగిరెడ్డి, అతని అనుచరులు తుపాకులతో కాల్చి చంపారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ కేసులో గంగిరెడ్డి అరెస్టు అయ్యాడు. తనకు పడిన శిక్షను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం హైకోర్టుకు పంపింది. ఇదంతా జరిగే సరికి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఫైల్స్ను మాయం చేశారనే ఆరోపణలు వచ్చాయి.
మురళీమోహన్రెడ్డి హత్యా కేసులో ప్రధాన నిందితుడు గంగిరెడ్డి కేవలం ఐదు నెలల 28 రోజులు మాత్రమే శిక్ష అనుభవించాడని బాధితుడి భార్య ఈ మధ్య కాలంలో ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. అతనికి ఆరేళ్లకు పైగా జైలు శిక్ష పడిందని, పరారిలో ఉన్న గంగిరెడ్డికి మిగతా శిక్ష అమలు చేయాలని ఆమె ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించి వివరాలు సేకరించారు. ఈ వివరాలను కడప కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దీంతో శుక్రవారం ఉదయం కోర్టు గంగిరెడ్డిపై అరెస్టు వారెంటు జారీ చేసింది.
కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను జిల్లా ఎస్పీ మారిషస్లో గంగారెడ్డి కేసు విచారణ జరుపుతున్న న్యాయస్థానానికి అందజేశారు. గంగిరెడ్డిపై ఎన్నో కేసులు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గంగిరెడ్డికి సంబంధించిన ఫైల్స్ అన్నీ మాయమైనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. గంగిరెడ్డికి సంబంధించిన అన్ని కేసులపై పోసులు విచారణ జరుపుతున్నారు.