"మా" పోరులో భారీ ట్విస్ట్ - సీసీటీవీ ఫుటేజ్ సీజ్ : మోహన్ బాబు -నరేశ్ దాడి చేసారు : కావాలన్న ప్రకాశ్ రాజ్..!!
"మా" ఎపిసోడ్ లో థ్రిల్లర్ మూవీని మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. "మా" ఎన్నికల్లో విష్ణు గెలిచిన తరువాత నాగబాబు..ప్రకాశ్ రాజ్ తో పాటుగా ప్రకాశ్ రాజ్ నుంచి ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యులు రాజీనామా చేసారు. పోలింగ్ రోజున సీసీటీవీ ఫుటేజ్ తమకు ఇవ్వాలని కోరుతూ ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాసారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగిన మూడు నెలల వరకు ఫుటేజ్ జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంది..తము ఆ ఫుటేజ్ అడిగే హక్కు ఉందని లేఖలో పేర్కొన్నారు.
పోలింగ్ రోజున ఆ ఇద్దరూ దాడి చేసారంటూ
పోలింగ్ రోజున మోహన్ బాబు - నరేశ్ తమ ప్యానల్ సభ్యుల మీద దాడి చేసారని..ఆ రోజున చోటు చేసుకున్న పరిణామాలు చూడాలని అందరూ కోరుకుంటున్నారని వివరించారు. సాధ్యమైనంత త్వరగా తమకు ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. ఆలస్యం అయితే ఫుటేజ్ డిలేట్ చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసారు. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచి..తన పదవికి రాజీనామా చేసిన సీనియర్ నటుడు బెనర్జీ సైతం మోహన్ బాబు తనను అసభ్యంగా తిట్టి కొట్టే ప్రయత్నం చేసారని చెప్పుకొచ్చారు. ఇక, విష్ణు ప్యానల్ నుంచి గెలిచిన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
సీసీటీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్ రాజ్
దీనికి ప్రకాశ్ రాజ్ తో సహా ఆ ప్యానల్ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. ఇక, తన చేతికి సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తరువాత న్యాయ పోరాటానికి దిగాలని ప్రకాశ్ రాజ్ భావిస్తున్నట్లుగా టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. మా ఎన్నికలు చాలా నిజాయితీగా నిర్వహించాం అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. సీసీ ఫుటేజ్ కావాలని అడిగారు.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తాం. సీసీ ఫుటేజ్ చాలా మంది అడిగారు. ఇవ్వడం మొదలు పెడితే ఎంతమందికి ఇవ్వాలి అని ఆయన అన్నారు.
ఇవ్వలేమని తేల్చిన ఎన్నికల అధికారి
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తాము ఇవ్వలేమని..చట్టప్రకారం అన్ని పరిశీలించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసారు. దీంతో..సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ ప్రకాశ్ రాజ్ టీం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో..మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలింగ్ జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఎన్నికల రోజున నాటి సీసీటీవీ ఫుటేజ్ ఉంచిన గదికి పోలీసులు తాళం వేసినట్లుగా తెలుస్తోంది.
పోలీసులు తాళం ఎందుకు వేసినట్లు..
సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేయగా, ఆయన పిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు పోలీసులు. తమ చేతికి రాకముందే ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందనేది ప్రకాశ్ రాజ్ అభియోగం. ఫుటేజ్ ఆధారంగా కోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రకాశ్ రాజ్ ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం పోలీసుల చేతికి వెళ్లటంతో ఇక, ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.