సెలెక్ట్ కమిటీ ఇష్యూ లో కొత్త ట్విస్ట్: గవర్నర్ కు ఫిర్యాదుతో..మండలికి కొత్త అధికారి..!
శాసన మండలి కేంద్రంగా జనవరిలో జరిగిన కీలక పరిణామాల తరువాత..తాజాగా శాసనమండలికి కొత్త సహాయ కార్యదర్శి నియమితులయ్యారు. అసెంబ్లీలో సహాయ కార్యదర్శిగా ఉన్న విజయరాజును మండలికి సంబంధించి లెజిస్లేషన్ బాధ్యతలు చూసే సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఈ బాధ్యతలను ఉప కార్యదర్శి రాజకుమార్ చూసేవారు. ఇప్పుడు ఆయన స్ధానంలో విజయరాజును నియమించారు.
మండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఆసక్తి కర చర్చకు కారణమైంది. మండలికి పూర్తి స్థాయి కార్యదర్శిగా విజయరాజును నియమించాలని ఆయన గవర్నర్ను కోరారు. అయితే సహాయ కార్యదర్శిగా విజయరాజును నియమించారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులే మండలికి కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. పై మార్పు తర్వాతా ఆయన కొనసాగుతారు. విజయరాజు నుంచి వచ్చిన ఫైళ్లపై ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తాజా పరిణామం వల్ల చైర్మన్కు మండలి వ్యవహారాల్లో కొంత వెసులుబాటు లభించే అవకాశం ఉంది.
మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలనే ఛైర్మన్ ఆదేశాలతో ఒక్కసారిగా ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. ఆ తరువాత మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం అమలు సాధ్యం కాదంటూ అసెంబ్లీ కార్యదర్శి రెండు సార్లు తన వద్దకు వచ్చిన నోట్ ను తిప్పి పంపారు. దీంతో..14 రోజుల లోగా సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపకపోతే అవి ఆమోదం పొందినట్లేనని ప్రభుత్వం వాదిస్తోంది. టీడీపీ మాత్రం ఆ నిబంధన కేవలం ద్రవ్య బిల్లులకు మాత్రమే ఉంటుందని..ఛైర్మన్ నిర్ణయమే ఫైనల్ అంటూ అవి ఖచ్చితంగా అమలు కావాల్సిందేనని పట్టు బడుతోంది.
Recommended Video
ఈ పరిస్థితుల్లో ఈ నెల చివర్లో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమయంలోనే..మండలి ఛైర్మన్ షరీఫ్ నేరుగా గవర్నర్ ను కలిసి జరిగిన పరిణామాలను వివరంచారు. దీంతో..తాజాగా శాసనమండలికి కొత్త సహాయ కార్యదర్శి నియమితులవ్వటం ఆసక్తి కరంగా మారింది. ఇదే సమయంలో టీడీపీ మాత్రం తాము వచ్చే సమావేశాల్లోనూ సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపటం..జరిగిన పరిణామాల పైన నిలదీస్తామని చెబుతోంది. హైకోర్టులో వాదనల సమయంలోనూ ప్రభుత్వం సైతం ఆ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపారని నివేదించిందని..ఇప్పుడు ఎలా నిర్ణయాన్ని మారుస్తారని టీడీపీ ప్రశ్నిస్తోంది. అయితే, దీని పైన వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.