శిరీష ఆత్మహత్యలో కొత్త కోణం: మిస్టరీ వెనుక 'నకిలీ వీసాలు', మంచికి పోతే చెడు ఎదురై?
తమ ఇంటి యజమాని పిల్లలకు వీసాలు ఇప్పించే విషయంలో సహకరించిన శిరీషకు మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా తెలుస్తోంది.
గుంటూరు: గత నెల 19న ఆత్మహత్య చేసుకున్న ఇంటూరి శిరీష(29) కేసులో మరో కోణం వెలుగుచూసింది. అప్పుల కారణంతోనే శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. నకిలీ వీసాలే ఆమె ప్రాణం తీశాయన్న అనుమానాలు కేసు చుట్టు ముసురుకున్నాయి.
తమ ఇంటి యజమాని పిల్లలకు వీసాలు ఇప్పించే విషయంలో సహకరించిన శిరీషకు మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా తెలుస్తోంది. లక్షల డబ్బు చెల్లించిన వీసాలు నకిలీవి అని తేలడం.. ఇంటి యజమాని శిరీష మీద ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ఎవరీ శిరీష:
అస్టేలియాలో ఉన్నత చదువులు చదివిన శిరీష.. కొన్నేళ్ల క్రితం గుంటూరు వచ్చి నవభారత్ కాలనీలోని అద్దె ఇంట్లో నివాసముంటోంది. శిరీష భర్త హాయ్ లాండ్ లో పనిచేస్తున్నారు. శిరీష విదేశాల్లో చదువుకుని రావడంతో.. తమ పిల్లలకు వీసాలు ఇప్పించే విషయంలో సహకరించాల్సిందిగా ఆమె ఇంటి యజమాని కోరారు.
తెలిసిన కన్సల్టెన్సీ అని:
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలోనే శిరీషకు ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీతో పరిచయం ఏర్పడింది. ఇంటి యజమాని తమ పిల్లల వీసాల సహాయం చేయాల్సిందిగా కోరడంతో.. సదరు కన్సల్టెన్సీతో శిరీష మాట్లాడింది. దీంతో హోటల్ మేనెజ్ మెంట్ కోర్సు కోసం ఇటలీ వెళ్లేందుకు ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా కన్సల్టెన్సీకి రూ.3లక్షల డబ్బు కూడా చెల్లించారు. మొత్తం 9మంది వీసాల కోసం డబ్బు చెల్లించారు.
నకిలీవని తేలడంతో:
డబ్బులు చెల్లించడంతో కన్సల్టెన్సీ నుంచి వీసాలు రావడం.. వారు అక్కడికి వెళ్లడం జరిగింది. తీరా అక్కడికెళ్లిన తర్వాత అవి నకీలివని తేలడంతో.. అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో శిరీష ఇంటి యజమానులు ఆమెను నిలదీశారు. కన్సల్టెన్సీ మోసం చేసిందని తెలియడంతో శిరీష తీవ్ర ఒత్తిడికి లోనైంది. తండ్రికి చెప్పుకుని బాధపడింది. అప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉండటం.. ఈ వ్యవహారంతో పరువు పోయిందని భావించడంతో.. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
ముంబై కేంద్రంగా:
ముంబై కేంద్రంగా నడుస్తున్న నకిలీ వీసా కన్సల్టెన్సీ నుంచి శిరీషకు కొరియర్ ద్వారా వీసాలు వచ్చినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. నకిలీ వీసాల ఆధారంగా ముంబైలోని మెహాతారోడ్ కృష్ణకుంజ్ ప్రాంతంలో ఉన్న గగన్దీప్ కార్యాలయంలో దాడులు చేశారు. నకిలీ వీసాలను తయారుచేసి విద్యార్థులను విదేశాలకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు గుంటూరుకు పంపించిన వీసాలతో తమకు సంబంధం లేదని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులకు విజిటింగ్ కార్డు ఇచ్చేందుకు కూడా వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెనుదిరిగి రాక తప్పలేదని చెబుతున్నారు. శిరీష ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు.