తాడిపత్రి కాల్పుల కేసులో ట్విస్ట్: వైసిపి నేత రమేష్రెడ్డిపైనే కేసు నమోదు
అనంతపురం: సంచలనం సృష్టించిన తాడిపత్రి వైసిపి నేత రమేష్ రెడ్డి కాల్పుల కేసులో పోలీసులు ఆయనపైనే కేసు నమోదు చేశారు. బుధవారం అర్థరాత్రి తన ఇంట్లో చొరబడిన అగంతకుడిపై రమేష్ రెడ్డి తన వద్ద ఉన్న లైసెన్స్ డ్ గన్ తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు వైసిపి నేత రమేష్ రెడ్డిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేసి అతడి గన్ స్వాధీనం చేసుకున్నారు. రమేష్ రెడ్డి నివాసంలో చొరబడిన అగంతకుడికి మతిస్థిమితం లేదని, అలాంటి వ్యక్తిపై కాల్పులు జరిపినందుకు రమేష్ రెడ్డిపై కేసు నమోదు చేసి నోటీసులు అందచేశారు. మరోవైపు వైసిపి నేత రమేష్ రెడ్డి నివాసంలో చొరబడిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులే ఎలా నిర్థారించి వదిలివేస్తారని, దీనివెనుక కుట్ర ఉందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
అగంతకుడి ప్రవేశం...కాల్పులు
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వైసిపి నేత కొనుదుల రమేష్రెడ్డి క్రిష్ణాపురం ఐదవ రోడ్డులో ఉన్న తన నివాసంలో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో కారిడార్లోకి గుర్తు తెలియని అగంతకుడు ప్రవేశించాడు. అనంతరం అతడు మూడో అంతస్థులో రమేష్రెడ్డి నిద్రిస్తున్నగది కిటికీ తలుపును తెరిచేందుకు ప్రయత్నించాడు. చప్పుడు వస్తుండటంతో మెలకువ వచ్చిన రమేష్ రెడ్డి తన లైసెన్స్ రివాల్వర్ తీసుకుని బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అగంతకుడు పారిపోయేందుకు యత్నించడంతో అతడు తనపై దాడి చేసేందుకే వచ్చాడని భావించిన రమేష్ రెడ్డి అతడిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
బుల్లెట్ గాయం..పోలీసుల రాక
దీంతో బుల్లెట్ గోడకు తగిలి ఆ తరువాత ఆ అగంతకుడి కాలిలోకి చొచ్చుకుపోయినట్లు చెబుతున్నారు. బుల్లెట్ దెబ్బకు ఆ అగంతకుడు అక్కడే కుప్పకూలిపోయాడు. గన్ పేలిన శబ్దం విని రమేష్రెడ్డి గన్మెన్ కింద ఫ్లోర్లో నుంచి మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. ఆ తరువాత కాల్పుల్లో గాయపడిన అగంతకుడు తలారి బాలచంద్రగా గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చామని చెబుతున్నారు. దీంతో పట్టణ సీఐ సురేందర్రెడ్డి వెంటనే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నాడు. బుల్లెట్ దెబ్బకు గాయపడిన అగంతకుడు బాలచంద్రను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చికిత్స...కేసు నమోదు
అక్కడి వైద్యులు అగంతకుడు ఎడమ కాలి పాదంలో ఉన్న బుల్లెట్ను తొలగించారు. అనంతరం పోలీసులు తలారి బాలచంద్రపై కేసు నమోదు చేసి అతడికి మతిస్థిమితం లేదని వదిలిపెట్టేశారని తెలుస్తోంది. మరోవైపు మతి స్థిమితం లేని వ్యక్తిపై కాల్పులు జరిపినందుకు రమేష్రెడ్డిపై కేసు నమోదు చేసి నోటీసులు అందజేశారు. తదనంతరం అతడి లైసెన్స్డ్ పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో పోలీసుల తీరును వైసిపి నేతలు తప్పుబడుతున్నారు.
తాడిపత్రి...ఉద్రిక్తత
అర్ధరాత్రి సమయంలో రమేష్ రెడ్డి నివాసంలో మూడో అంతస్తులోకి చొరబడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించకుండా తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పి వదిలి పెట్టేశారని, ఆ విషయాన్ని పోలీసులే ఎలా నిర్థారిస్తారని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిడితో కేసును తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఆ అగంతకుడికి మతిస్థిమితం లేదని ధృవీకరించారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాల్పుల ఘటన, వైసిపి నేత రమేష్రెడ్డిపై కేసు నమోదులతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.