రఫ్గా పెరిగిన గెడ్డం..: జగన్లో తమను చూసుకుంటున్న యువత: ట్విట్టర్ ఫాలోవర్లు అనూహ్యం
అమరావతి: టెక్నాలజీ వాడకంలో తనను మించిన వారు లేరనేది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఊతపదం. వీలైన ప్రతిచోటా ఆయన ఈ పదాన్ని వాడేస్తుంటారు. అదే టెక్నాలజీ, అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పతనాన్ని శాసించడంలో ఓ చెయ్యి వేసింది. అదలా వుంచితే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అసాధారణ వేగాన్ని చూపిస్తున్నారాయన. ఆయన ప్రమేయం లేకుండానే వైఎస్ జగన్కు అభిమానులుగా మారుతున్నారు నెటిజన్లు. అధికారాన్ని అందుకున్న ఆరురోజుల వ్యవధిలో- వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల నెటిజన్లు మంత్ర ముగ్ధులవుతున్నారు.
ఆరు నెలలు కాదు.. ఆరురోజుల్లోనే..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చేసిన తొలి సంతకం వృద్ధ్యాప్య పింఛన్ పెంపు. అర్హులైన వయోధిక వృద్ధులకు చెల్లించే పింఛన్ మొత్తాన్ని 2,000 నుంచి 2,250 రూపాయలకు పెంచారు. ఏటేటా 250 రూపాయలను అదనంగా కలుపుకొంటూ 3000 రూపాయలకు తీసుకెళ్తారు. అటు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఇటు నిధులను సమన్వయం చేసుకుంటూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం నెటిజన్లను ఆకట్టుకుంది. అదే సమయంలో- మూత్రపిండాల వ్యాధిగ్రస్తులుకు ప్రతినెలా 10 వేల రూపాయల పింఛన్ చెల్లింపు కూడా ప్రశంసలు అందుకుంది. ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.
అడిగింది రూ.6000..ఇచ్చింది రూ.10,000
ఆశా వర్కర్ల వేతనాల పెంపు కూడా వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని చూపినట్టయింది. ఇదివరకు ఆశా వర్కర్లకు ప్రతినెలా గౌరవ వేతనంగా 3000 రూపాయలను చెల్లించేది గత ప్రభుత్వం. ఈ మొత్తాన్ని పెంచాలని, ప్రతినెలా తమకు 6,000 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆశా వర్కర్లు ధర్నాలు, ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు పాలయ్యారు. వారి దుస్థితికి చలించిన వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలుపుకొన్నారు. ప్రమాణ స్వీకారం చేసి, వారం రోజులు కూడా తిరగక ముందే- ఆశా వర్కర్ల వేతనాన్ని 10 వేల రూపాయలకు పెంచారు.
యువతకు చేరువ చేసిన సింప్లిసిటీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో తమను తాము చూసుకుంటున్నారు యువకులు. తెల్లచొక్కా ధరించి, రఫ్గా పెరిగిన గెడ్డంతో కనిపిస్తుంటారు వైఎస్ జగన్. కాస్త పరాగ్గా చూస్తే- ఓ నిరుద్యోగిని పోలిన ఆహార్యంతో కనిపిస్తుంటారాయన. ఆ సింప్లిసిటీ, నిరాండబరంగా ఉండటం.. యువతను చేరువ చేసింది. ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఆయన అతి సాధారణంగా కనిపించారు. సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో సమీక్షా సమావేశాల్లోనూ ఆయన అదే రూపంతో కనిపిస్తుంటారు. మాట తప్పని, మడమ తిప్పని నైజం కూడా యువతకు చేరువ చేయడానికి ఓ కారణమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తరువాత వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, తండ్రి పేరు మీద పార్టీని ఏర్పాటు చేయడం.. ఆ తరువాత అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ..వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారని, అలాంటి పోరాట తత్వం నేటి రాజకీయ నేతల్లో కొరవడిందని నెటిజన్లు చెబుతున్నారు.
అనూహ్యంగా ట్విట్టర్ ఫాలోవర్లు
ట్విట్టర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అనుసరించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆదివారం నాటికి వైఎస్ జగన్ అధికారిక ట్విట్టర్ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 11 లక్షల మార్క్ను అందుకుంది. ఆ సంఖ్యను దాటెల్లింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సుమారు రెండు లక్షల మంది కొత్తగా ఆయనను ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. కాగా- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ట్విట్టర్లో అనుసరించే వారి సంఖ్య 40 లక్షలకు పైమాటే.