'వారికి పదవులు ఇచ్చి చాలా తప్పు చేశాం, వారిద్దరు పవన్ కళ్యాణ్ బ్రోకర్లు'
అమరావతి: భారతీయ జనతా పార్టీ పైన, ఆ పార్టీ ఏపీ నేతల పైన తెలుగుదేశం పార్టీ శుక్రవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వారికి, చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. చంద్రబాబును అడ్డుకోవడంపై టీడీపీ భగ్గుమంటోంది.
చంద్రబాబు కనుసైగ చేస్తే బీజేపీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు రాలేరని టీడీపీ హెచ్చరికలు జారీ చేసింది. పాముకు పాలుపోసి పెంచినట్లుగా ఏపీ బీజేపీ నేతలకు తాము పదవులు ఇచ్చి తప్పు చేశామన్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్రోకర్లు అని ఆరోపించారు.
జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!
చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా పేరు, మోడీకి ఈర్ష్య
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై ఏపీ ప్రభుత్వం యూసీలు ఇచ్చినట్లుగా నీతి అయోగ్ చెబుతోందని చెప్పారు. కానీ బీజేపీ నేతలు మాత్రం యూసీలు ఇవ్వలేదని చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ బీజేపీ నేతలపై తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని, దేశంలో, ప్రపంచంలో ఆయనకు మంచి పేరు వస్తోందని, అక్కసు, ఈర్ష్యతో ప్రధాని మోడీ అత్యంత నీచంగా మాట్లాడారన్నారు. ప్రధాని స్థాయి నుంచి దిగజారి మాట్లాడారన్నారు.
ధైర్యం లేని వారు అడ్డుకునే ప్రయత్నం
మంత్రి నారా లోకేష్ కూడా చంద్రబాబును అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై భగ్గుమన్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. బీజేపీ, భారతీయ జోకర్స్ పార్టీగా మారిందన్నారు. ఏపీకి నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్న మోడీ ఇంటి ముందు ధర్నా చేసే దమ్ము, ధైర్యం లేని బీజేపీ నాయకులు సీఎంను అడ్డుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. ఏపీలో బీజేపీని ప్రజలు మట్టిలో కలిపేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు.
అది చంద్రబాబు కష్టార్జితం
లోకేష్.. ఉపాధిహామీ పథకం నిధులు గురించి కూడా ప్రస్తావించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రాలకు ఉపాధిహామీ పథకం ద్వారా అధిక నిధులు రావడం చట్టం ద్వారా వచ్చిన హక్కు అన్నారు. ఇందులో బీజేపీ భిక్ష ఏమీ లేదని చెప్పారు. అది చంద్రబాబు కష్టమన్నారు. ఏపీకి ఉపాధిహామీలో ఎక్కువ నిధులు కేటాయించామని అర్థం లేని చర్చ చేస్తున్న ఏపీ బీజేపీ నాయకులు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఈ పథకం నిర్వహణలో ఎందుకు వెనుకబడి ఉన్నాయో చెప్పాలన్నారు.