ఎట్ హోమ్కు ఇద్దరు సిఎంలూ గైర్హాజర్: కారణం తెలియదన్న గవర్నర్
హైదరాబాద్: భారత గణ తంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాలేదు. రాజభవన్లో గవర్నర్ మంగళవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించి విందు ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. వారిద్దరు కూడా రాలేదనే విషయాన్ని గవర్నర్ నరసింహన్ ధ్రువీకరించరు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు రాలేదో కారణం తనకు తెలియదని ఆయన అన్నారు. ఇద్దరు సిఎంల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన చెప్పారు.
ఈ రోజు కార్టూన్ ; Picture of the day
ఎట్ హోమ్ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు హాజరయ్యారు. తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ సలహాదారు డీ శ్రీనివాస్తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మ అవార్డు విజేతలను కూడా గవర్నర్ తేనీటి విందుకు ఆహ్వానించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు ఈ విందుకు హాజరయ్యారు.