ఇంజినీరింగ్ విద్యార్థినులకు వేధింపులు: కానిస్టేబుళ్లకు దేహశుద్ధి
ప్రకాశం: ఇంజినీరింగ్ విద్యార్థినులపై ఈవ్టీజింగ్కు పాల్పడిన ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లకు ప్రజలు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఆదివారం జిల్లాలోని సింగరాయకొండలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న పినాకిని ఎక్స్ప్రెస్లో ఇద్దరు మెరైన్ కానిస్టేబుళ్లు నాగరాజు, షేక్ ఖాదర్హుస్సేన్ చీరాలలో ఎక్కారు.
వీరు ఎక్కిన కంపార్టుమెంట్లో ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థినులను వేధించారు. ఒక విద్యార్థిని సింగరాయకొండ స్టేషన్లో దిగగానే కానిస్టేబుళ్లు కూడా దిగారు. దిగిన వెంటనే వారు ఆమెను ‘నీ పేరు ఏంటని అడగ్గా'.. ‘మా నాన్న వస్తున్నారు ఆయన్నడగండి చెబుతారనడంతో' వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత కారులో వెళుతున్న ఆ విద్యార్థిని రైల్వేస్టేషన్ రోడ్డులోని టిఫిన్ సెంటర్లో ఉన్న కానిస్టేబుళ్లను తండ్రికి చూపించి, తమను వేధించిన విషయం చెప్పింది. ఈ విషయమై అడగడానికి వెళ్లిన విద్యార్థిని తండ్రి రవిబాబుపై కానిస్టేబుళ్లు తిరగబడ్డారు.
ఇది గమనించిన స్థానికులు ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు దేహశుద్ధి చేశారు. తాము మెరైన్ కానిస్టేబుళ్లమని చెప్పడంతో స్థానికులు వారిని విడిచిపెట్టారు. దీనిపై సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్లో చెప్పినా పోలీసులు స్పందించలేదని స్థానికులు చెప్పారు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మల్లికార్జునరావు తెలిపారు.