ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజల పేరుతోనే నిందితులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అద్భుతాలు జరుగుతాయంటూ పూజలు
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మదనపల్లి స్థానిక శివనగర్లో పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు గత కొంతకాలంగా నివాసముంటున్నారు. పురుషోత్తమ నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తుండగా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేటు విద్యాసంస్థకు కరస్పాండెంట్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య(27), సాయిదివ్య(22) కుమార్తెలున్నారు.
కాగా, గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు పురుషోత్తమ్, పద్మజ దంపతులు.
ఇద్దరు కుమార్తెలను డంబెల్తో కొట్టి చంపారు..
ఈ క్రమంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించారు. మొదట సాయి దివ్యను, ఆ తర్వాత అలేఖ్యను వారి నోట్లు చిన్న చెంబులు పెట్టి.. వ్యాయామం చేసే డంబెల్తో అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఆ ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు కాలేజీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ రవి మనోహారాచారి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురుషోత్తమనాయుడు, పద్మజ, వారి ఇద్దరు కుమార్తెలు కూడా దైవభక్తితో పూజలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
Recommended Video
మళ్లీ బతికిస్తాం.. కరోనా శివుడి తలవెంట్రుకల నుంచే..
ఈ నేపథ్యంలోనే తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని డీఎస్పీ తెలిపారు. క్లూస్ టీం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందని తెలిపారు. నిందితులు పురుషోత్తమనాయుడు, పద్మజలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నిందితులు పొంతన లేకుండా ఏదేదో చెబుతుండటం గమనార్హం. తమ కుమార్తెలను మళ్లీ బతికించుకుంటామని అంటున్నారు. అంతేగాక, కలియుగం అంతమైపోతుందని, అందుకే పూజలు చేసినట్లు చెబుతున్నారు. కరోనా చైనాలో కాదని, శివుడి తల వెంట్రుకల నుంచి పుట్టిందని.. కరోనా కూడా అంతమవుతుందని పురుషోత్తమనాయుడు, పద్మజ చెబుతుండటం గమనార్హం. నిందితురాలు పద్మజ ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్ కావడం శోచనీయం.