ఒకే పార్టీ రెండు వెర్షన్లు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బీజేపీలో భిన్నస్వరాలు.. తగ్గకపోతే దెబ్బే?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు... ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదని చెప్పారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి మాత్రం... ఈ నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదంటూ భిన్న స్వరం వినిపించారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ విశాఖ ఉక్కు విషయంలో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే ఆ పార్టీకి నష్టం తప్పదన్న వాదన వినిపిస్తోంది.
సోము వీర్రాజు ఏమన్నారు...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై స్పందించిన సోము వీర్రాజు... ఈ నిర్ణయంపై ఎమ్మెల్సీ మాధవ్ ఇప్పటికే కేంద్ర స్టీల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్,కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి చర్చించారని తెలిపారు. ఎంజీ జీవీఎల్ నర్సింహారావు కూడా కేంద్రమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. ఈ నెల 14న రాష్ట్రం నుంచి బీజేపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్తుందని తెలిపారు. విశాఖ ఉక్కు విషయంపై కేంద్రమంత్రులతో సహా జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చిస్తామని... అవసరమైతే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించే విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నారు. ప్రత్యేక పరిస్థితుల రీత్యా ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరుతామన్నారు.
సుజనా వాదన వేరే....
మరోవైపు ఇదే అంశంపై సోము వీర్రాజుకు భిన్నంగా స్పందించారు ఎంపీ సుజనా చౌదరి. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదని... ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రెండు దశాబ్దాల క్రితమే తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించిన తర్వాత కూడా అదీ విశాఖలోనే ఉంటుందని... ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని తెలిపారు. ఆర్థిక విధానాలు,సాంకేతికత అభివృద్ది చెందుతున్నకొద్ది ఇలాంటి నిర్ణయాలు తప్పవని అన్నారు.
వెనక్కి తగ్గకపోతే దెబ్బే..?
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల దేవాలయాలపై దాడులకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలతో హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నం చేసింది. త్వరలో తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో హిందువుల ఓట్లను గంప గుత్తగా పొందాలనే యోచనలో ఉంది. ఇలాంటి తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్రం నిర్ణయం ఏపీలో బీజేపీకి నష్టం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. విభజన తర్వాత ఎన్నో కష్ట,నష్టాలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏమీ ఇవ్వకపోగా ఉన్న ఫ్యాక్టరీలను కూడా ప్రైవేటీకరించడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో బీజేపీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ముందుకెళ్తే ఆ పార్టీకి నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.