రెండు రైళ్లలో దుండగుల బీభత్సం...భారీగా నగలు చోరీ
అనంతపురం: అనంతపురం జిల్లాలో రెండు వేర్వేరు రైళ్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రెండు రైళ్లలో సిగ్నల్ వైర్లు కత్తిరించి మరీ దోపిడీలకు పాల్పడ్డారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ పరిధిలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆయుధాలతో బెదిరించి ఆభరణాల దోపిడీకి పాల్పడిన దొంగలు నిజాముద్దీన్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ జుక్కల్ చెరువు వద్ద ట్రైన్లోకి చొరబడి చోరీ చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో...దోపిడీ
అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ పరిధిలోని రాయల చెరువు జూటూరు రైల్వే స్టేషన్ దగ్గర వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోకి చొరబడిన దోపిడీ దొంగలు ఎస్-10, ఎస్-11, ఎస్-12 బోగీలలో ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి ఆభరణాలు దోచుకెళ్లారు. ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారు ఆభరణాలు, రూ. 10వేల నగదును అపహరించినట్లు వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును బట్టి తెలుస్తోంది.
గంటవ్యవధిలో...మరో ట్రైన్ లో...
వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చోరీ జరిగిన గంట వ్యవధిలోనే నిజాముద్దీన్ నుంచి తిరుపతి వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్జక్కల చెరువు వద్ద క్రాసింగ్ కోసం ఆగి ఉంది. అదే అదనుగా భావించిన దోపిడీ దొంగలు ఆ ట్రైన్లోకి చొరబడిన వివిధ కంపార్ట్ మెంట్ లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ రైలులో 10తులాల బంగారం, రూ.10వేల నగదును దుండగులు అపహరించినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అయితే రైల్లో తమకు ఎటువంటి రక్షణ కల్పించలేదని గుత్తి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ దోపిడీ కూడా...సిగ్నల్ మార్పుతోనే...
ఈ రెండు దోపిడీలు కూడా సిగ్నల్ కేబుల్ వైర్లు కత్తిరించి చేసినట్లు భావిస్తున్నారు. దీంతో దుండగుల తీరు, తెగువకు రైల్వే శాఖ విస్మయం చెందుతోంది. ఇటీవలే మేడికొండూరు మండలం సిరిపురం రైల్వే స్టేషన్ అవుటర్లో ఇటువంటిదే దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. స్టేషన్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నర్సాపురం ఎక్స్ప్రెస్ ఆగకుండా వెళ్లేందుకు అనుమతులు ఇచ్చినా రైలు అవుటర్లో ఆగింది!...దీనికి కారణం రైల్వే సిగ్నల్ లేకపోవడమేనని సమాచారం. అదే విధంగా తాజా ఘటనల్లోనూ జరిగినట్లు భావిస్తున్నారు.
సీరియస్ గా...రైల్వే శాఖ
వరుస దొంగతనాలు...అదీ సిగ్నల్ లింక్ తో ముడిపడివున్న ఈ దోపిడీలను రైల్వే శాఖ చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిగ్నల్ ట్యాంపరింగ్ కు సంబంధించిన విషయాలు రైల్వే శాఖ ప్రతిష్టతో ముడిపడి ఉన్నందున బైటకు వెల్లడించడం లేదని భావిస్తున్నారు. ఏదేమైనా వరుస ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న రైల్వే శాఖ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, సిగ్నల్ వ్యవస్తను మరింత పటిష్ట పరచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.