పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు మౌనం వెనుక ? మళ్లీ తెరపైకి రెండు కళ్ల సిద్ధాంతం...! వర్కవుటవుతుందా ?
చంద్రబాబుకు ఆగర్భ శత్రువైన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే మొదలైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వ్యవహారంపై టీడీపీ ఏనాడూ సూటిగా స్పందించింది లేదు. తాజాగా జగన్ సర్కార్ జారీ చేసిన జీవోతో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చినా టీడీపీ ఈసారీ గుంభనంగానే వ్యవహరిస్తోంది. ఓ రాజకీయ పార్టీగా తన అభిప్రాయం చెప్పడంలో తప్పేమీ లేకపోయినా ఇరు రాష్ట్రాల్లో తన ప్రయోజనాల పేరిట టీడీపీ పాటిస్తున్న వ్యూహాత్మక మౌనం చివరికి ఆ పార్టీ పుట్టి ముంచడానికి మినహా మరెందుకూ పనికిరాదనే వాదన వినిపిస్తోంది.
చంద్రబాబు డిమాండ్ ను జగన్ వినలేదు... చివరికి కేజ్రివాల్ నెరవేర్చాడిలా...
పోతిరెడ్డిపాడుపై టీడీపీ వ్యవహారశైలి...
తీవ్ర కరువు, దుర్భిక్షంతో సతమతమయ్యే కరువు సీమ రాయలసీమలో తాగునీరు, సాగునీటికి ప్రధాన జల వనరుగా మారిపోయిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో టీడీపీ వైఖరి ముందునుంచీ అస్పష్టమే. అప్పట్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో ఎన్ని వివాదాలు తలెత్తినా పోతిరెడ్డిపాడుపై ముందుకెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమివ్వగా.. టీడీపీ మాత్రం స్ధానిక నేతలతోనే దీనిపై ఉద్యమాలు చేయించింది. ఇటు కర్నూల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అటు మహబూబ్ నగర్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి నేతలే ఈ ఉద్యమాల్లో టీడీపీ తరఫున కనిపించేవారు.
ఇప్పటికీ టీడీపీది అదే రాజకీయం...
కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగు, సాగు నీరు అందించే ప్రాణాధార ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు విషయంలో టీడీపీ అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్నా, లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాలో, రెండు రాష్ట్రాల్లో ఉనికి కాపాడుకునే క్రమంలో ఇరు రాష్ట్రాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే ప్రయత్నించాలి. ఈ మూడూ చేయలేకపోతే మౌనంగా ఉండటం ద్వారా రాజకీయాన్ని కాలానికే వదిలేయాలి. అడిగితే రెండు కళ్ల సిద్ధాంతం పేరు మీద ఎంతైనా రాజకీయం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ నాలుగో ఫార్ములానే టీడీపీ మరోసారి ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
చివరికి బీజేపీ బాటలో....
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ఉన్న కాల్వల సామర్ధ్యం రెట్టింపు చేయాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై మౌనంగా ఉంటే చాలు కేసీఆర్, జగన్ మధ్య వార్ మొదలవుతుంది. ఆ లోపు ఏదో ఒకటి తేలిపోతుందన్న చందాన టీడీపీ అధినేత మౌనాన్నే ఆశ్రయించారు. షరామామూలుగా స్ధానిక టీడీపీ నేతలతో మాట్లాడించడం మొదలుపెట్టారు. తన దాకా వస్తే చూద్దాంలే అన్న వైఖరే ఇందుకు కారణం. దురదృష్టవశాత్తూ ఆలోపే ఇరు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ మినహా మిగిలిన విపక్ష పార్టీలన్నీ పోతిరెడ్డిపాడుపై మాట్లాడటం మొదలుపెట్టాయి. రాజకీయంగా లాభమో, నష్టమో స్ధానికంగా ఉన్న కొన్ని పార్టీలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను వెనకేసుకొచ్చాయి. చివరికి నష్టమైనా బీజేపీ వంటి జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, బండి సంజయ్ సైతం రాష్ట్రాల వారీగా భిన్నవైఖరులను ఎంచుకున్నారు. చివరికి అదే బీజేపీ నేతలు ఈ వ్యవహారాన్ని కేసీఆర్, జగన్ నాటకంగా తేల్చేశాయి. చివరికి చంద్రబాబు కూడా పార్టీ నేతలతో ఇదంతా ఓ నాటకమని చెప్పుకొచ్చారు.
రెండు కళ్ల సిద్ధాంతమే కారణమా...
పోతిరెడ్డిపాడు వంటి ఇరు రాష్ట్రాలకు కీలకమైన ఓ ప్రాజెక్టుపై ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా, తెలంగాణలో విపక్ష పార్టీగా టీడీపీ స్పందన ఇంత పేలవంగా ఉండటానికి కారణం ఇరు రాష్ట్రాల్లో పార్టీ ప్రయోజనాలే. మరోలా చెప్పాలంటే ఆనాటి రెండు కళ్ల సిద్ధాంతమే. తెలంగాణ కావాలా, ఆంధ్రా కావాలా అని అడిగితే ఉమ్మడి ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు అప్పట్లో రెండు కళ్లలో ఏది కావాలంటే ఏం చెప్పగలం అంటూ దాటవేశారు. సరిగ్గా ఇప్పుడు పోతిరెడ్డిపాడు విషయంలోనూ టీడీపీ అధినేత మరోసారి ఏదో విధంగా దాటవేత ధోరణినే కనబరుస్తున్నారు. పోతిరెడ్డిపాడుపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం తప్పయితే తప్పని, సరైనదే అయితే సమర్ధిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న ఇరు రాష్ట్రాల్లో సాధారణ ప్రజానీకంలో సైతం వినిపిస్తోంది. అయినా చంద్రబాబు మాత్రం ఇరు సీఎంలు కలిసి నాటకం ఆడుతున్నారంటూ ఓ పాసింగ్ రిమార్క్ కే పరిమితం కావడం సొంత పార్టీ నేతలకు సైతం మింగుడు పడటం లేదు.
Recommended Video
ఏపీపై ఇప్పటికైనా దృష్టిపెట్టరా.. సీమ కోణంలో మంచి అవకాశం...
2014 ఎన్నికల్లో ఏపీపై దృష్టిపెట్టేందుకు వీలుగా తెలంగాణ పగ్గాలను ఎల్.రమణకు అప్పగించి తాను జాతీయ అధ్యక్షుడిగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అలాగే ఏపీలో పార్టీ పగ్గాలను కళా వెంకట్రావుకు ఇచ్చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఏపీపై ఎక్కువగా ఫోకస్ పెట్టక తప్పని పరిస్దితుల్లో తెలంగాణకు దూరమయ్యానని, ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. అలా అని ఏపీపై నిజంగానే చంద్రబాబు దృష్టిపెట్టారా అంటే గతేడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలే దానికి సమాధానం చెబుతాయి. తన స్వస్ధలమైన రాయలసీమ ప్రాంతంలో అయితే టీడీపీకి వచ్చిన సీట్లు మూడే మూడు. అందులో తాను కూడా ఒకరు. దీనంతటికీ ప్రధాన కారణం రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు దృష్టిపెట్టలేదనే వాదన. ఇప్పటికైనా రాయలసీమకు ప్రాణాధారమైన పోతిరెడ్డిపాడు రూపంలో పోరాడటం ద్వారా తాను సీమ అభివృద్ధిని వదిలేయలేదని చెప్పుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. అయినా చంద్రబాబు మాత్రం అస్పష్ట వైఖరితో దాన్ని దూరం చేసుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.