పడగ విప్పిన పాతకక్షలు: పట్టపగలు గొంతు కోసి చంపేశారు
గూడూరు: పాతకక్షలు పడగ విప్పి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. దారి కాచి బంధువులే మారణాయుధలతో వెంటాడి అత్యంత దారుణంగా నరికి చంపేశారు. చిన్న జయరామయ్య (30), డేగా పెద్ద జయరామయ్య (32) అనే ఇద్దరిని గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో ఆదివారం జరిగింది.
పందులను మేపుకుంటూ జీవనం సాగించే సమీప బంధువులైన డేగా రామయ్య, డేగా చెంగయ్య కుటుంబాలకు పాత కక్షలు ఉండేవి. ఈ ఏడాది జూలై 5న డేగా చెంగయ్య కుమారుడు నారాయణ పందులను మేతకు తోలుకెళ్తున్నాడు.
వారిపై కేసు నమోదు
ఈ సమయంలో డేగా రామయ్యతో కలిసి అతని తమ్ముడు చిన కోటయ్య, కొడుకులు చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్య, బాబు, కాపుకాసి నారాయణను హత్య చేశారు. దీంతో పోలీసులు చిన్న, పెద్ద జయరామయ్యలు, బాబు, తండ్రి రామయ్య, చిన్నాన్న చిన్న కోటయ్యలైన ఐదుగురిపై హత్య కేసు నమోదు చేశారు. దాంతో పాటు వారిపై రౌడీ షీట్లు తెరిచారు.
మళ్లీ ఇందుకు తిరిగి వచ్చారు
ముందు జాగ్రత్తగా వారిని ఊరు విడిచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో, వారు కోట మండలం విద్యానగర్కు కాపురం వెళ్లాపోయారు. ఈ క్రమంలో గత శుక్రవారం రామయ్య ఇల్లు కాలిపోవడంతో, చిన్న, పెద జయరామయ్యలు, సోదరుడు బాబు, వారి భార్యాపిల్లలు గూడూరుకు వచ్చారు.
అదును చూసి, కాపు కాసి...
దాన్ని అదునుగా తీుకుని కాపుకాసి ఉన్న డేగా చెంగయ్య బంధవులు రమేష్, శీను, చింతాలు, కాంతారావుతో ఇంకొందరు మహిళలు ఇంటి పనులు చేసుకుంటున్న చిన్న జయరామయ్య, పెద్ద జయరామయ్యలతోపాటు, వారి కుటుంబ సభ్యులపై కారప్పొడి చల్లి దాడికి పాల్పడ్డారు.
ఒకతను ఇలా తప్పించుకున్నాడు...
సోదరులు చిన్న పెద్ద జయరామయ్యలను విచక్షణా రహితంగా గొంతు కోసి, ముఖంపై కత్తులతో పొడిచి గుర్తుపట్టలేనంతగా చంపేశారు. ఈ దాడిలో సోదరులిద్దరూ మృతి చెందగా, పెద్ద జయరామయ్య భార్య చినక్క, అత్త పూజారి రామమ్మ తీవ్రంగా గాయపడ్డారు. అయితే సోదరులతోపాటు వచ్చిన బాబు అప్పుడే వెళ్లిపోవడంతో తప్పించుకున్నాడు. .
మిన్నంటిన బంధువుల రోదనలు..
హత్య జరిగినట్లు తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరుకుని మృత దేహాల వద్ద బోరున ఏడ్చేశారు. తమ వారిని హత్య చేసిన వారిని కూడా చంపేస్తామంటూ బయలుదేరారు. అయితే డీఎస్పీ వారిని వారించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి మృతుని భార్య చిన్నక్క నుంచి వివరాలు సేకరించారు.