ఏపీలో భయపెడుతున్న కరోనా... ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు మృతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత,టైపిస్ట్ సుబ్రహ్మణ్యం కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు కూడా మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
సచివాలయంలో గత వారం ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా.. సోమవారం(ఏప్రిల్ 19) మరో ఇద్దరు మృతి చెందారు. హోంశాఖలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఏఎస్ఎన్ మూర్తి,పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతి కుమార్ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఉద్యోగుల మృతికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందడంతో... మిగతా ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సచివాలయంలోని వివిధ విభాగాల్లో ఇప్పటికే 100మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిందని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులు విజయవాడ,గుంటూరుల్లోని హెచ్ఓడీ కార్యాలయ నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు,పదో తరగతి పరీక్షల రద్దు,రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం(ఏప్రిల్ 19) ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం ప్రభుత్వ నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా... ప్రభుత్వం మాత్రం వైరస్ కట్టడికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ కొరతపై టీడీపీ తరుపున ప్రధాని మోదీకి లేఖ రాస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.
కాగా,పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే విద్యా సంస్థలన్నింటినీ మూసివేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.