జగన్ కాన్ఫడెన్స్కు కారణం ఆ ఇద్దరేనా ? ఇప్పుడు టూర్ కూడా వారి ప్లానేనా ?
పోలింగ్ నాడు రాత్రి జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే..ఎవరికైనా ఆయనే గెలిచేది అనిపిస్తుంది. తమ విజయం ఖాయమని చెబుతూనే..సీట్లు కాదు..లాండ్ స్లైడ్ విక్టరీ అంటూ ఆత్మ విశ్వాసం ప్రకటించారు. అయితే, అంతగా తన విజయం పైన నమ్మకం కలగటానికి కష్టం మొత్తం తనదే అయినా.. ఆయనకు పార్టీ నేతలతో పాటుగా ఇద్దరు ముఖ్యులు జగన్కు అండగా నిలిచారు.. అందులో ఒకరు రాజకీయ వ్యూహాలు అందిస్తే..మరకొరు మంచి ముహూర్తాలను ఖరారు చేసిన జగన్కు సహకరించారు.
జగన్ వెనుక ఆ ఇద్దరూ..
2014 ఎన్నికలు..2019 ఎన్నికల్లో జగన్ తీరుకు చాలా తేడా ఉంది. నాడు తండ్రి ఇమేజ్..సానుభూతి..అభిమానం మాత్రమే జగన్ ఆయుధాలు. కానీ, 2019 నాటికి ఎన్నికల యుద్దం అందునా చంద్రబాబు లాంటి సీనియర్తో ఎలా చేయాలో పక్కా ప్లాన్ ప్రకారం వెళ్లారు. అందులో భాగంగా వ్యూహకర్త అవసరమని గుర్తించారు. ఒక జాతీయ పార్టీ ప్రముఖుడి సూచన మేరకు ప్రశాంత్ కిషోర్ను పార్టీ వ్యూహాకర్తగా నియమించుకున్నారు. 2014లో ప్రధానిగా మోదీ గెలుపు వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు..ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. అదే విధంగా..సహజంగా ఎప్పుడూ దేవుడిని ఎక్కువగా నమ్మే జగన్ ఈసారి ముహూర్త బలాన్ని నమ్మారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గంలోనే విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని నమ్మారు. ఆయన చెప్పిన ముమూర్తాలు.. సమయం ఆధారంగా తన నిర్ణయాలను అమలు చేసారు.
నంద్యాలో విఫలమైనా..
ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్న తరువాత టిడిపి నుండి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని జగన్ పట్టించుకోలేదు. రెండేళ్లు ముందుగానే 2019 ఎన్నికల కోసం పక్కా ప్రణాళికా బద్దంగా వెళ్లారు. జగన్ తాను పాదయాత్ర చేయాలని నిర్ణయించిన వెంటనే..దానికి ఏ రకంగా ప్రజల్లో ఆదరణ వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలో ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన చేసారు. పాదయాత్ర ప్రకటన చేసిన పార్టీ ప్లీనరీ వేదికగానే ఎన్నికల మేనిఫెస్టో నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక, నంద్యాల ఎన్నికల సమయంలోనూ ప్రశాంత్ కిషోర్ వైసిపి కోసం పని చేసారు. అయినా..అక్కడ అధికార పార్టీ ఆర్దిక..అధికార..అంగ బలం తో ఎన్నికలను గెలిచారని పార్టీ నేతలు చెబుతారు. ఆ సమయంలో కొందరికి ప్రశాంత్ కిషోర్ సమర్ధత పైన అపనమ్మకం ఏర్పడింది. కానీ, ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ..వ్యూహాలకు పదును పెట్టారు. అభ్యర్దుల ఖరారు మొదలు...ప్రచార వ్యూహాల వరకు అన్నింటా పికె సూచనలు చేయం..జగన్ తన ప్రజాకర్షణ శక్తితో వాటిని ప్రజల్లో అమలు చేయటంతో జగన్ పోలింగ్ తరువాత అంత నమ్మకంగా తన విజయం గురించి చెప్పగలిగారనేది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
ఆయన అనుమతితోనే..
జగన్ 2014 ఎన్నికల వరకు ఏ స్వామిజీని కానీ, ఏ ఆశ్రమాన్ని కానీ దర్శంచ లేదు. కానీ, ఆ తరువాత తన విధానం మార్చుకున్నారు. ప్రధానంగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిజీని నమ్మారు. ఆయన తో రుషికేష్లో యాగం చేయించారు. ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక, అభ్యర్దుల ప్రకటన ముహూర్తం ఆయన సూచన మేరకు ఆ రాత్రి 9 గంటలకు 9 మంది పేర్లను ప్రకటించారు. జగన్ తన పాదయాత్ర ప్రారంభ ముహూర్తం సైతం ఆయన సూచనల మేరకే ఖరారైంది. పార్టీలోని జగన్ కోటరీగా చెప్పుకొనే కొందరు నేతలతో పాటుగా ఈ ఇద్దరు జగన్ కు సహకరించారు. జగన్ వెనుక ఉండి ముందుకు నడిపించారు.