గ్యాంగ్ వార్: సయోధ్యకు చింటూ విందు, పరస్పర దాడిలో ఇద్దరు హతం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలో గ్యాంగ్ వార్ తీవ్ర సంచలనం సృష్టించింది. రెండు గ్రూపులకు మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు గ్రూపు నాయకులు హత్యకు గురయ్యారు నిడమూరు రోడ్డు రైల్వే గేటు సమీపంలో గురువారం అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
హేమంత్, రమేష్ అనేవారు రెండు గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చింటూ అనే వ్యక్తి వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాత్రి విందు ఏర్పాటు చేశాడు.
ఆ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు కూడా అక్కడికక్కడే మరణించారు. సమాచారం తెలుసుకున్న ఇరు వర్గాలు కూడా పరస్పరం దాడులకు దిగాయి.
ఆ గాడుల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారు మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చింటూ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.