విషాదం.. మృతదేహాన్ని తరలిస్తూ మృత్యు ఒడిలోకి... ఇద్దరి మృతి,ఇద్దరి పరిస్థితి విషమం...
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నుంచి జిల్లాలోని స్వగ్రామానికి తరలిస్తుండగా... ఆ వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలవగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంతో ముగ్గురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డుపై ఎదురుగా వెళ్తున్న లారీ టైర్ ఒక్కసారిగా పంక్చర్ అవడం... వెనకాలే వస్తున్న వాహనం దాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నుంచి వెళ్తుండగా..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) చాలాకాలంగా హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సుబ్బయ్య మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామానికి తరలించాలనుకున్నారు. ఇందుకోసం ఓ బొలెరో వాహనాన్ని మాట్లాడుకుని మృతదేహంతో పాటు కుటుంబ సభ్యులు,బంధువులు మొత్తం 10 మంది అందులో బయలుదేరారు.
లారీ టైర్ పంక్చర్ కావడంతో...
బొలెరో వాహనం మోక్షగుండం సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా ఉన్న లారీ టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో లారీ స్పీడ్ ఒక్కసారి తగ్గగా... వెనకాలే వస్తున్న బొలెరో వేగంగా దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో ముందు సీట్లలో కూర్చొన్న గంప సుబ్బలక్ష్మమ్మ(50), ఓరుసు దాసరయ్య(55)లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వెంకట సుబ్బయ్యకు సుబ్బ లక్ష్మమ్మ పెద్ద కుమార్తె కాగా.. దాసరయ్య చిన్న కుమార్తె అల్లుడిగా తెలుస్తోంది.
ఇద్దరి పరిస్థితి విషమం...
ఈ ప్రమాదంలో మిగతా 8 మంది తీవ్ర గాయాలపాలవగా ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి వెంకట సుబ్బయ్య మరణంతో విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు,బంధువులకు సుబ్బలక్ష్మమ్మ,దాసరయ్య మరణం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఒకరి మృతదేహాన్ని తరలించబోయి ఇలా మరో ఇద్దరు మృత్యువాతపడటం మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.