మృత్యుశకటం: చిన్నారి గుండెల్లో దిగిన హర్వెస్టర్ బ్లేడ్లు
నల్గొండ: జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున విషాద ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి పండగను తమ స్వగ్రామంలో చేసుకుందామని బయలుదేరిన ఆ కుటుంబంలో ఇద్దరు లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు. అందులో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉండటం మరో విషాదం.
కార్తీక పూజల కోసం స్వగ్రామం వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెందగా ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. హుజూర్నగర్లో బ్యాటరీ దుకాణం నిర్వహించే గుడిపల్లి వెంకట్రెడ్డి(35), భార్య జ్యోతి (30), తమ ఇద్దరు పిల్లలు శ్రీజ (5), కుమారుడు(2)తో స్వగ్రామం వేములపల్లి మండలం గుర్రప్పగూడెం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
కానీ, దారి మధ్యలోనే వరి కోసే యంత్రం(హార్వెస్టర్) రూపంలో కాలయముడు పొంచి ఉండి రెండు నిండు ప్రాణాలు బలిగొన్నాడు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మాడ్గులపల్లి శివారులో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాడ్గులపల్లి శివారులోకిరాగానే అకస్మాత్తుగా వరికోత యంత్రం దూసుకొచ్చింది. దీంతో బైక్ అదుపుతప్పి హార్వెస్టర్కు ఢీకొంది. ఆ హార్వెస్టర్ బ్లేడ్లు చిన్నారి శ్రీజ గుండెల్లోకి దూసుకుపోయాయి. ఆ బ్లేడ్లలోనే చిక్కుకుని చిన్నారి కన్నుమూసింది.
వెంకట్రెడ్డి చాతిలోకి బ్లేడ్లు దిగడంతో ఆయన అక్కడిక్కడే మరణించారు. కన్నుమూసి తెరిచే లోగా వారు మృత్యువాతపడ్డారు. జ్యోతికి మూడుచోట్ల చెయ్యి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో జ్యోతి చికిత్స పొందుతోంది. తల్లి ఒడిలో కూర్చున్న కుమారుడు క్షేమంగా ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.