బోరబండలో విషాదం: పట్టాలు దాటుతూ రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి
హైదరాబాద్: బోరబండ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఇద్దరు మహిళలు రైలు ఢీకొని దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే... భరత్నగర్లోని బంధువుల ఇంటికి జహీరాబాద్ నుంచి వచ్చిన లింగమ్మ (50), తుల్యమ్మ (30) సోమవారం ఉదయం జహీరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు.
బోరబండ రైల్వే స్టేషన్కు వచ్చే క్రమంలో పట్టాలు దాటుతున్న తల్లి, కూతుర్ని ఎదురుగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. విషయాన్ని పోలీసులకు రైల్వే అధికారులు సమాచారం అందించారు.
నాంపల్లి రైల్వే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మృతులు మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలా ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్లు, పట్టాలు దాటేటప్పుడు చూసుకుని నడవాలంటూ ప్రయాణీకులకు తెలియజేశారు.
సాగర్ ఎడమ కాల్వలో దంపతుల గల్లంతు
నల్గొండ జిల్లాలోని వేములపల్లి వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో దంపతులు గల్లంతు అయ్యారు. భార్య మృతదేహాం లభ్యమైంది. భర్త కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పిండప్రదానం చేస్తుండగా దంపతులు కాల్వలో జారి పడ్డారు. మృతురాలి పిల్లలు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విశాఖలో గోడ కూలి ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలో గాజువాక శివారు మిండీగ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మిండీ గ్రామంలో డ్రైనేజ్ పనులు జరుగుతుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు మరణించారు. మృతులు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన కూలీలు లావణ్య, ఈశ్వర్లుగా గుర్తించారు.