ఏపీ సీఎం జగన్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
ఏపీలో సోషల్ మీడియా వేదికగా వీరు వారు అన్న తేడా లేకుండా ఎవరి మీద పడితే వారి మీద అసభ్యకర పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కించపరుస్తూ ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారు అంటే సోషల్ మీడియా ఏ రేంజ్ లో చెలరేగిపోతుందో అర్ధం చేసుకోవచ్చు . ఇక ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది.
ఏపీ సీఎం జగన్ పై ఫేస్ బుక్ లో కించపరిచే పోస్టులు .. వైసీపీ నేతల ఫిర్యాదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్ట్ లు పెడుతున్న వారిపై వైసిపి నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక దీంతో జగ్గయ్యపేట కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్పై ఫేస్బుక్లో అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వ్యక్తితో పాటు ఆ పోస్ట్ ను షేర్ చేసిన మరో వ్యక్తిని కూడాఅరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నాగేంద్ర కుమార్ తెలిపారు . జగ్గయ్యపేట పోలీసులు పట్టణానికి చెందిన చల్లపల్లి అవినాష్, చిల్లకల్లుకు చెందిన ఏనిక గోపిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్టు చేసిన నిందితులకు కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు.
గుంటూరు జిల్లాలోనూ ఇప్పటికే ఒక వ్యక్తిపై కేసు నమోదు
సరిగ్గా నెలరోజుల క్రితం కూడా ఇదే తరహా అసభ్యమైన పోస్టింగ్ సీఎం జగన్ పైన చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు గుంటూరు జిల్లా పోలీసులు. గుంటూరు జిల్లా తుళ్లూరు కు చెందిన వ్యక్తిని సోషల్ మీడియాలో పోస్టులు నేపథ్యంలో అరెస్టు చేశారు. గోపాల్నగర్కు చెందిన పెద్దబోయిన వెంకట శివరావు అనే యువకుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని , ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేని శివరావు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నాడు. సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలపై తన ఫేస్బుక్ అకౌంట్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని వైసిపి నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు తాజాగా జగ్గయ్యపేట కు చెందిన ఇద్దరు పై పోలీసులు కేసు నమోదు చేశారు .
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్త అంటున్న పోలీసులు
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో ప్రముఖ వ్యక్తులపై అసభ్యకర పోస్టింగ్లు, షేర్లు చేసి అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దని పోలీసు శాఖ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అవేమీ పట్టనట్టు సోషల్ మీడియా వేదికగా చెలరేగి పోతే తర్వాత ఊచలు లెక్కించవలసి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు.